జగన్, కేసీఆర్ వద్దు.. స్వామిజీలే బెటర్.. తెలుగు రాష్ట్రాల్లో ఇదో ట్రెండ్..!
అమరావతి : సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధుల దగ్గరకు వెళ్లడం ప్రజాస్వామ్యంలో భాగం. పెద్ద స్థాయిలో సమస్య ఉన్నప్పుడు నేరుగా ముఖ్యమంత్రులను కలిసే అవకాశం కూడా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో అది కుదరకపోవచ్చు. వారి బిజీ షెడ్యూల్తోనో, ఇతరత్రా కారణాలతోనో అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి కూడా ఉంటుంది.
అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. పనుల నిమిత్తం ముఖ్యమంత్రులను కలవకుండా స్వామీజీల వెంట పడుతున్నారు జనాలు. వారు ఓ మాట చెబితే వీరు కచ్చితంగా వింటారనే నమ్మకంతో అటువైపు అడుగులేస్తున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణలో అలాంటి ఘటన జరగగా.. తాజాగా ఏపీలో కూడా సేమ్ సిట్యువేషన్ కనిపించింది.
రేషన్ డీలర్లకు మంగళం.. జగన్ నిర్ణయంతో దుమారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అధికారులను పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రమాణ స్వీకారం అలా అయిపోగానే ఇలా పని మొదలు పెట్టిన జగన్.. ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకుంటున్నారనే ముద్ర వేసుకున్నారు.
ఆ క్రమంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ డీలర్లకు మంగళం పాడనున్నట్లు ప్రకటించారు. గ్రామ వాలంటీర్లను నియమించి రేషన్ సరుకులు లబ్ధిదారుల ఇళ్లకే నేరుగా పంపించే ఏర్పాట్లు చేస్తామన్నారు. జగన్ నిర్ణయంతో రేషన్ డీలర్లు ఉలిక్కిపడ్డారు. ప్రజా పంపిణీ వ్యవస్థ రద్దు చేయొద్దని డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయినా జగన్ నిర్ణయంలో ఎలాంటి మార్పు కనిపించకపోయేసరికి.. స్వామిజీ మీరే దిక్కంటూ.. శారదా పీఠం స్వరూపనందేంద్ర స్వామిజీ దగ్గర వాలిపోయారు.
ప్రైవేట్ ట్రావెల్స్పై కొరడా.. నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే.. ఇక ఏపీలో స్ట్రిక్ట్
జగన్ నిర్ణయంతో డీలా.. స్వామిజీ దగ్గరకు పరుగులు
వైఎస్ జగన్ నిర్ణయంతో రేషన్ డీలర్లు డీలా పడ్డారు. నిరసనలు చేసినా ప్రయోజనం లేదని భావించి స్వామిజీని కలిశారు. జగన్ మనసు మారేలా చూడండి స్వామి అంటూ వేడుకున్నారు. మీరే మాకు దిక్కంటూ కాళ్లు మొక్కారు. స్వరూపనందేంద్ర స్వామిని జగన్ బాగా విశ్వసిస్తారని.. ఆ క్రమంలో ఆయన ఓ మాట చెబితే ఈయన వింటారని తలంచి స్వామిజీ దగ్గరకు క్యూ కట్టారు. అందుకే జగన్ను కలిసే యోచన లేకుండా.. నేరుగా విశాఖలోని శారదా పీఠానికి వెళ్లి అక్కడ మొరపెట్టుకున్నారు.
స్వరూపనందేంద్ర స్వామి నిర్వహించిన రాజశ్యామల యాగంతో జగన్కు ముఖ్యమంత్రిగా యోగం దక్కిందనే ప్రచారముంది. ఆ క్రమంలో స్వామిజీ అంటే జగన్కు గురి ఏర్పడిందనే టాక్ వినిపిస్తోంది. అందుకే స్వామిజీతో ఓ మాట చెప్పించుకుని.. రేషన్ డీలర్ల వ్యవస్థ రద్దు చేయాలనే ఆలోచనను జగన్ విరమించుకునేలా ఓ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
ఆ మధ్య చినజీయర్ స్వామిని కలిసిన తెలంగాణ రెవెన్యూ అధికారులు
ఆ మధ్య తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు చినజీయర్ స్వామిని కలిశారు. సీఎం కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తామని వ్యాఖ్యానించిన క్రమంలో.. వారు చినజీయర్ను కలవడం చర్చానీయాంశమైంది. రెవెన్యూ శాఖను రద్దు చేస్తే తమ పరిస్థితి ఏంటని.. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ తమకు దొరకడం లేదని.. అందుకే తమను కలిసి బాధలు చెప్పుకునేందుకు వచ్చామని వివరించారు. దాంతో ఆయన స్పందిస్తూ.. నా ఆశీర్వాదం ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావని అభయహస్తం ఇచ్చినట్లు ఉద్యోగులు వెల్లడించారు. ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే చినజీయర్ను వారు కలిశాక కేసీఆర్ నోట మళ్లీ ఆ మాట రాకపోవడం గమనార్హం. మొత్తానికి మంచి లాజిక్కే పట్టుకుని ఇలా ముఖ్యమంత్రులను కాకుండా స్వామిజీలను కలుస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.