రిపబ్లిక్ డేలో ఏపీ శకటానికి షాక్, రక్షణ శాఖ నో: కేంద్రంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షాక్ తగిలింది! జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా శకటాల ప్రదర్శనకు నవ్యాంధ్రప్రదేశ్ శకటం ఎంపిక కాలేదు. శకటాల ప్రదర్శన కోసం అన్ని రాష్ట్రాలకు కేంద్ర రక్షణ శాఖ గత ఏడాది ఆగస్టు నెలలో ఆహ్వానాలను పంపించింది.
జాతిపిత మహాత్మా గాంధీ జీవితంతో సంబంధం ఉన్న ఇతివృత్తాలతో వాటిని రూపకల్పన చేయాలని సూచించింది. ఏపీ ప్రభుత్వం విజయవాడ గాంధీకొండ, పొందూరు ఖద్దరు, పల్లిపాడు సత్యాగ్రహ ఆశ్రమం ఇతివృత్తంతో డ్రాయింగ్స్ వేసి పంపించింది. కానీ దీనిని ఎంపిక చేయలేదు.
ఆశ్చర్యానికి గురి చేసిందని ఏపీ భవన్ అధికారులు
తమ శకటాన్ని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఏపీ భవన్ అధికారులు అంటున్నారు. స్వదేశీ ఉద్యమానికి గుర్తింపుగా విజయవాడలోని గాంధీ కొండ పైన గాంధీ పీస్ ఫౌండేషన్ 52 అడుగుల స్థూపం నిర్మించింది. తిలక్ పీస్ ఫౌండేషన్కు రూ.1 కోటి సమీకరించే లక్ష్యంతో ప్రజలు చరఖాలు కొనుగోలు చేసి స్వదేశీ ఉద్యమంలో పాల్గొనాలని ఈ కొండమీద నుంచి గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. పొందూరు ఖద్దరు, పల్లిపాడు సత్యాగ్రహ ఆశ్రమానికి చరిత్ర ఉంది.
అద్భుతంగా ఉన్నప్పటికీ ఎంపిక కాలేదు
గాంధీజీ స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్తున్న ఈ ఘట్టాలను రిపబ్లిక్ డే వేడుకగా చాటాలని ఏపీ ప్రభుత్వం భావించింది. ఈ ఇతివృత్తాలను రక్షణ శాఖ పరిశీలించి అంగీకరించింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం త్రీడీ నమూనా, ఇతివృత్త సంగీతాన్ని రూపొందించింది. చివరి రౌండ్ వరకు ఏపీ నమూనా పోటీలో ఉంది. కానీ చివరికి ఎంపిక కాలేదు. అద్భుతంగా ఉన్నప్పటికీ ఎంపిక కాలేదని అధికారులు వాపోతున్నారు.
అప్రమత్తమైన జనసేన.. హడావుడిగా పిలిపించి: జగన్-పవన్లతో భేటీపై అసలు అలీ ఏం చెప్పారు?
చంద్రబాబు ఆగ్రహం
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ శకటానికి అనుమతి ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పురోగతిని కేంద్ర ప్రభుత్వం భరించలేకపోతోందని ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది. రాష్ట్రం పైన కేంద్రం అక్కసు వెళ్లగక్కుతోందన్నారు. ఏపీ శకటానికి అనుమతి నిరాకరించడం దీనికి పరాకాష్ట అన్నారు. రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ శకటం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.