అసెంబ్లీ సీట్లు పెరగవ్ : 2026 తరవాతే సాధ్యం : తేల్చేసిన కేంద్రం..
Recommended Video
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు పై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. ఏపి పునర్విభజన చట్టం మేరకు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంది. అయితే, దీని పై అటు ఏపి..ఇటు తెలంగాణ ప్రభుత్వాలు రాజకీయంగా కేంద్రం పై ఒత్తిడి తెచ్చాయి. కానీ, అది ఇప్పటి వరకు సాధ్యపడలేదు. ఇక, ఇప్పుడు కేంద్రం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు విషయంలో అనుమానాలు లేకుండా తేల్చి చెప్పేసింది.
ఏపి పునర్విభజన చట్టం ప్రకారం ఏపి..తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాల్సి ఉంది. దీని కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్..ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేసారు. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు సైతం సీట్ల పెంపు కోసం న్యాయ- హోం శాఖల అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు.
అయితే, అది రాజకీయ నిర్ణయం తో ప్రధాని ఆమోదం లేక అమలుకు నోచుకోలేదు. సీట్ల పెంపుకు న్యాయ సంబంధ అడ్డంకులు ఉన్నాయని..దీనికి రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేయవచ్చనే ప్రతిపాదన పైనా చర్చ జరిగింది. కానీ, రాజకీయంగా ఎవరి వ్యూహాలు వారికి ఉండటంతో సీట్ల పెంపు ప్రతిపాదనలకే పరిమితం అయింది. దీని పై అటు లోక్సభ లోనూ..ఇటు రాజ్యసభలోనూ ఏపి - తెలంగాణ సభ్యులు కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఇక, తాజాగా బుధవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ సుజనా చౌదని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగారాం ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 తర్వాత సేకరించే తొలి జనాభా లెక్కల ప్రకారమే.. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు ఉంటుందని ఆయన అన్నారు. దీనిని పరిగణలోకి తీసుకుంటే మరో దశాబ్దం వరకూ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుకు అవకాశం లేనట్లే..