ఎన్టీఆర్ స్ఫూర్తితో బీజేపీపై ధర్మపోరాటం... పేదరికాన్ని గెలవడమే ఆయనకు నిజమైన నివాళి
అమరావతి : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నేటి తరానికి ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. టెలీకాన్ఫరెన్స్ లో పార్టీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు.. ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఆద్యుడని.. ఆయన ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పేదరికాన్ని గెలవడమే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అంటూ పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమాజసేవను మించింది లేదని.. పేద ప్రజలకు సేవలందించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని సూచించారు.
ప్రస్తుతం దేశంలో నిరంకుశత్వం పెచ్చుమీరిందని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. బీజేపీ రూపంలో నిరంకుశత్వం.. మోడీ రూపంలో పెత్తందారీ విధానం రాజ్యమేలుతున్నాయని చెప్పుకొచ్చారు. నిరంకుశత్వాన్ని ఎలా ఎదిరించాలో ఎన్టీఆర్ నేర్పించారని.. అదే స్ఫూర్తితో బీజేపీపై ధర్మపోరాటం చేస్తున్నామని తెలిపారు.