ఓ పక్క సంక్షేమ పథకాలు..! మరో పక్క ప్రతిపక్షాల పై విసుర్లు..! పని మొదలు పెట్టిన బాబు..!!
అమరావతి/ హైదరాబాద్ : ఏపి లో రాజకీయం నివురు గప్పిన నిప్పులా తయారయ్యింది. ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల రాజకీయ నేతలతో సన్నిహితంగా ఉండడమే కాకుండా అన్ని వర్గాల ప్రజల అభిప్రాయలను సైతం ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర సహకారంతో ఏపి బీజేపి వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా 175 నియోజక వర్గాల్లో అభ్యర్థులను పోటీ లో దింపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక అదికారంలో ఉన్న టిడిపి అన్ని పార్టీలకంటే భిన్నంగా ముందుకు వెళ్తోంది.
అటు పథకాల ప్రకటన..! ఇటు లోటు బడ్జెట్..! తగ్గేది లేదంటున్న బాబు..!!
గత ఎన్నికల సమయంలో ఏపి ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూనే ప్రతిపక్షాలపై వినూత్న ఎటాక్ ప్రారంభించారు చంద్రబాబు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైయస్ఆర్సీపి అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏపీ కి చేస్తున్న అన్యాయం పట్ల ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసీపి ఎందుకు ప్రశ్నించడంలేదనే అంశాన్ని ఎత్తి చూపుతున్నారు చంద్రబాబు. అంతే కాకుండా కేంద్ర బీజేపి ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఘాటుగా విమర్శిస్తున్నారు.
ఎవరి వ్యూహాలు వారివి..! ఏపిలో పరాకాష్టకు చేరిన ఆదిపత్య పోరు..!!
ఏపీలో రాజకీయ వ్యూహాల్లో నాలుగు పార్టీలు ఎవరికి వారు ముందుండాలని ప్రయత్నం చేస్తున్నారు. పధకాల ప్రకటనలతో చంద్రబాబు దూసుకుపోతుంటే, ప్రజలంతా నా వైపే ఉన్నారని ప్రతిపక్ష నేత జగన్ ముందుగానే సీఎం కుర్చీ పైన ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరూ కాకుండా చక్రం తిప్పేది తానే అని జనసేనాని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలు, రేపు ఢిల్లీ దీక్ష సందర్భంగా చంద్రబాబు తన పార్టీ శాసన సభా పక్ష నేతలతో సమావేశమై భవిశ్యత్ కార్యాచరణపై చర్చించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రతిపక్షాల వైఖరిని కూడా సమర్థవంతంగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు బాబు.
ప్రతిపక్షాలపై గళం పెంచిన బాబు..! టైంపాస్ రాజకీయాలంటూ విమర్శలు..!!
ఏపీకి అన్యాయం చేసిన ద్రోహులతో ఒకవైపు, నేరస్థులతో మరోవైపు పోరాడుతున్నామని, నేరస్థుల మైండ్ గేమ్ అందిరికన్నా విభిన్నంగా ఉంటుందని బాబు వ్యాఖ్యానించారు. మైండ్ గేమ్లో జగన్ నిష్ణాతుడని, దానిని చాకచక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే చట్ట సభకు రాకుండా రెండేళ్లుగా ప్రజా సమస్యలను గాలికి ఒదిలేసిన వారు వీరు మాత్రమే కావచ్చని చంద్రబాబు ఎద్దేవా చేసారు. ఏపీలో బీజేపీకి బలం శూన్యని, ఏ నియోజకవర్గంలోనూ డిపాజిట్లు దక్కే అవకాశం లేదని, అసలు వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఘాటుగా స్పందించారు.
విభజన హామీలపై పోరాటం ఉద్రుతం చేస్తాం..! ఛలో ఢిల్లీ అంటున్న ఏపీ సీయం..!!
ఏపీలో బీజేపీ గురించి మాట్లాడటం టైం వేస్ట్ అన్నారు చంద్రబాబు. ఏపీ అసెంబ్లీలో పునర్విభజన చట్టం అమలుపై చర్చ ఉంటుందని, సభ్యులందరూ ఉభయ సభలకు నల్లచొక్కాలు వేసుకుని నిరసన తెలపాలన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చ అనంతరం ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని అన్నారు. ప్రత్యేక హోదా సాధన నిమిత్తం ప్రత్యేక హోదా సాధన సమితి చేసిన బంద్కు మద్దతుగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం క్రుషి చేస్తూనే ప్రతిపక్షాలపై పెద్ద యెత్తున విరుచుకు పడుతున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని రేపు జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఏ మేరకు స్వాగతిస్తారో చూడాలి.