ఒక రాష్ట్రం ఒకే రాజధాని.. వైఎస్ జగన్ అమరావతిలో గడ్డి కూడా పీకలేడు : చంద్రబాబు, లోకేష్ ఫైర్
రాజధానిగా అమరావతి కొనసాగాలంటూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం 300వ రోజుకు చేరుకుంది. రాష్ట్రంలో నిత్యం సంచలన ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో రాజధాని అమరావతి పోరాటం మరుగున పడినట్టు కనిపిస్తోంది. అయితే మొదటి నుండి రాజధాని అమరావతి పరిరక్షణకు, రైతులకు బాసటగా పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాజధాని అమరావతి రైతుల పోరాటాన్ని పట్టించుకోని ప్రభుత్వ పాలనపై మండిపడుతోంది.
ఒకే రాష్ట్రం , ఒకే రాజధాని.. ప్రజలంతా నినదించాలన్న చంద్రబాబు
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని అమరావతి పరిరక్షణ కోసం రైతులు చేస్తున్న పోరాటానికి బాసటగా ఉంటామని ప్రకటించారు .అంతేకాదు టీడీపీ శ్రేణులు సంఘీభావం తెలపాలని, నిరసన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఒకే రాష్ట్రం , ఒకే రాజధాని అంటూ ప్రజలంతా నినదించాలని ఆయన సూచించారు. ఇప్పటివరకు రాజధాని అమరావతి ఉద్యమంలో 92 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులయ్యారని చంద్రబాబు పేర్కొన్నారు.
మూడు వందల రోజులైనా ప్రభుత్వంలో చలనం లేదు
మూడు వందల రోజులు గడుస్తున్నా రాజధాని రైతులు పోరాటం చేస్తున్న ప్రభుత్వం రైతులకు ఊరట కల్పించే ఒక్క మాట కూడా చెప్పలేదు అంటూ చంద్రబాబు మండిపడ్డారు. పాలకుల అహంకారం ఈ స్థాయిలో ఉండడం దారుణం అంటూ చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నేడు రాజధాని రైతుల పోరాటానికి మద్దతుగా కృష్ణాయ పాలెంలో నారా లోకేష్ పర్యటించారు. అమరావతి రైతులకు మద్దతు తెలిపిన నారా లోకేష్ రాజధాని అమరావతి ప్రాంత ప్రజలు రాజధాని ఇక్కడే ఉండాలని వారెప్పుడూ కోరుకోలేదని, అన్ని ప్రాంతాలకు సమ దూరం ఉండాలని ఆరోజు అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశారని చెప్పారు.
మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల మధ్య జగన్ చిచ్చు పెట్టారన్న లోకేష్
అసెంబ్లీ సాక్షిగా జగన్ మోహన్ రెడ్డి రాజధానిగా అమరావతి ఒప్పుకున్నారని పేర్కొన్న నారా లోకేష్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలోకి రాగానే మరొకలా మాట మార్చారని మండిపడ్డారు. మూడు రాజధానులు పేరుతో జగన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని మండిపడ్డారు. అన్ని కులాలు ,మతాల వాళ్ళు అమరావతిలో ఉన్నప్పటికీ, అమరావతిలో ఒకే కులం ఉందంటూ అసత్య ప్రచారాలు చేశారని నారా లోకేష్ పేర్కొన్నారు. రాజధాని ప్రాంత రైతులు 30 వేల ఎకరాలకు పైగా భూమిని ఇచ్చి నేడు రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు.
Recommended Video
తుగ్లక్ సీఎం , మెంటల్ సీఎం అంటూ మండిపాటు
తుగ్లక్ సీఎం, మెంటల్ సీఎం ప్రజలను మోసం చేశారంటూ నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. అమరావతిలో మొలిచిన గడ్డి కూడా జగన్ పీకలేరు అని, జగన్ తుగ్లక్ పాలనను తరిమికొట్టే వరకూ ఓర్పు సహనం తో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని లోకేష్ పేర్కొన్నారు. భూదందాల కోసం విశాఖ ను రాజధానిగా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో ఒక్క పరిశ్రమ రాలేదని, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని జగన్ చెప్పే వరకు పోరాటం ఆగకూడదు అంటూ లోకేష్ దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా వేదికగా జనంలోకి కూడా ఈ నినాదాన్ని బాగా తీసుకు వెళ్లాలని, సంయమనంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నారా లోకేష్ స్పష్టం చేశారు.