ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వండి: పవన్ కళ్యాణ్ దరఖాస్తు, మీరూ దరఖాస్తు చేసుకోండి.. విధివిధానాలివే!
అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ టిక్కెట్ కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళవారం దరఖాస్తు చేసుకున్నారు. స్క్రీనింగ్ కమిటీకి టిక్కెట్ కోసం అభ్యర్థిగా తొలి దరఖాస్తు జనసేనానిదే. జనసేన పార్టీలో టిక్కెట్ కేటాయింపు స్క్రీనింగ్ కమిటీ ద్వారానే జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని లోకసభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల ఖరారు తుది నిర్ణయం స్క్రీనింగ్ కమిటీదే.
ఆశావహుల దరఖాస్తుల పరిశీలనకు విధివిధానాలు, దిశానిర్దేశనం
సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోకసభ స్థానాల నుంచి జనసేన పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలవాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తు (బయోడేటా) నమూనాకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఆమోదం తెలిపింది. మంగళవారం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పీఏసీ సమావేశమైంది. దరఖాస్తు నమూనా, పరిశీలన ప్రక్రియ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో దరఖాస్తుల పరిశీలన చేసే స్క్రీనింగ్ కమిటీకి దిశానిర్దేశనం చేశారు.
విధివిధానాలు ఖరారు
ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన ఆశావహుల దరఖాస్తులలో ఎలాంటి వివరాలు పొందుపర్చాలి, వారికి ఉండాల్సిన కనీస అర్హతలు వంటి అంశాలపై పీఏసీ చర్చించింది. స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు అనుసరించాల్సి విధివిధానాలను ఖరారు చేశారు. అనంతరం దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ప్రారంభించాలని స్క్రీనింగ్ కమిటీకి పీఏసీ సూచించింది. స్వీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను తెలిపింది. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్, మాదాసు గంగాధరం, రావెల కిషోర్ బాబు, పీ బాలరాజు, రాఘవయ్య, తోట చంద్రశేఖర్, రామ్మోహన్ రావు, సుజాత పాండా, హరిప్రసాద్, అర్హం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
తొలి బయోడేటా పవన్ కళ్యాణ్దే
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 2019 లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారు తమ బయోడేటాలను మాదాసు గంగాధరం నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీకి ఇవ్వాలని చెప్పారు. ఆయన పార్టీ కార్యాలయంలో అభ్యర్థుల దరఖాస్తు స్వీకరణ, ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత తన బయోడేటాను సమర్పించారు. దీంతో బయోడేటా స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు.
'వైయస్ జగన్ చెప్పాడా... అయితే ఒకే.. ఇదీ చంద్రబాబు నాయుడు మాట'
పోటీ చేయాలనుకుంటే వీరికి మాత్రమే ఇవ్వాలి
2009లో ప్రజారాజ్యం అనుభవం దృష్ట్యా డబ్బు అనే అంశానికి ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వకుండా నిబద్దత, కష్డపడేతత్వాన్ని బట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇందులో అవకతవకలకు ఆస్కారం లేదన్నారు. అభ్యర్థులు కూడా పక్క మార్గాలకు వెళ్లవద్దని, బయోడేటాను నేరుగా కమిటీకి ఇవ్వాలన్నారు. పరిశీలనాధికారం కమిటీకి మాత్రమే ఉందని చెప్పారు. స్క్రీనింగ్ కమిటీకి బలమైన నిర్ధేశిత సూత్రాలు ఇచ్చామని, అందుకు అనుగుణంగానే పరిశీలన ప్రక్రియ ఉంటుందని చెప్పారు. జనసేన అభ్యర్థులు బయోడేటాలను సమర్పించేందుకు ఈ అయిదుగురు సభ్యుల కమిటీ మాత్రమే ఉందని, దయచేసి వారికే ఇవ్వాలన్నారు.
జనసేన తరఫున పోటీ చేయాలంటే..
స్క్రీనింగ్ కమిటీకి చెందిన గంగాధరం మాట్లాడుతూ... అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నియామకానికి పవన్ కొన్ని మార్గదర్శకాలు సూచించారని చెప్పారు. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. పవన్ తమపై పెట్టిన బాధ్యతను చిత్తశుద్ధితో, వారి నమ్మకానికి తగినట్లుగా పని చేస్తామన్నారు. నేటి నుంచి (మంగళవారం ఫిబ్రవరి 12) బయోడేటాలు తీసుకుంటున్నామని, విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆశావహులు బయోడేటా ఫార్మ్స్ అందుబాటులో ఉంటాయని, అక్కడే వివరాలు పూర్తి చేసి అందించాలన్నారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకు రావాలన్నారు.
తెలంగాణ, ఏపీ కమిటీలపై పవన్ కళ్యాణ్ దృష్టి
తెలంగాణ పార్లమెంటు స్థానాలకు కమిటీల ఎంపిక పూర్తయిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐదు పార్లమెంటు స్థానాలకు కమిటీలు ప్రకటించామని చెప్పారు. నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, హైదరాబాద్, అధిలాబాద్, కరీంనగర్లకు కమిటీలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు కమిటీల ఎంపిక పూర్తయిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో మిగతా స్థానాలకు కమిటీలు వేయడంపై దృష్టి సారిస్తామని చెప్పారు.