90 అడుగుల భారీ వాసవీమాత విగ్రహావిష్కరణలో పవన్ కళ్యాణ్, ఆయన ఏం చెప్పారంటే?
పెనుగొండ: తాము అధికారంలోకి వచ్చాక పెనుగొండను శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి పెనుగొండగా మారుస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ప్రకటించారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా పెనుగొండలో 90 అడుగుల వాసవీ మాత విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. వాసవీమాత పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు కనుల పండువగా జరిగాయి.
ధర్మం దారి తప్పునప్పుడు ప్రాణం కంటే మానం గొప్పదని భావించిన తల్లి
పెనుగొండలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి కుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. ధర్మం దారి తప్పినప్పుడు ప్రాణం కంటే మానం గొప్పదని భావించి ఆత్మార్పణ చేసుకున్న పవిత్రమూర్తి కన్యకాపరమేశ్వరి అమ్మవారు అన్నారు. ఆమె జన్మించిన ఊరుగానే కాదు, ఆత్మార్పణ చేసుకున్న పవిత్ర స్థలంగానూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు విశిష్ట స్థానం ఉందన్నారు.
ఎంతో పుణ్యం
వేలాదిమంది భక్తులతో పాటు తాను కూడా ఇక్కడకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యంగా భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. భక్తుల పాలిట కొంగుబంగారంలా ఉంటూ విశేష పూజలందుకుంటున్న కన్యకా పరమేశ్వరి తల్లిని దర్శించుకునే భాగ్యం తనకు కల్పించినందుకు వాసవీ ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలు అన్నారు. ఆ చల్లని తల్లి శుభాశీస్సులు రాష్ట్రంలోని అందరి ఆడపడుచులపై ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
ఘన స్వాగతం
ఈ సందర్భంగా వాసవీ మాత దర్శనానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ను కమిటీ సభ్యులు ఆలయ లాంఛనాలతో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలతో ఆలయంలోకి ఘనస్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ పైభాగం వరకు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు జనసేనాని. విగ్రహ ముఖభాగం వద్ద పూజలు చేసి ప్రమాణాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
17 కోట్లతో 90 అడుగుల విగ్రహం
కాగా, పెనుగొండలో రూ.17 కోట్లతో శ్రీ వాసవీమాత 90 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన కుంభాబిషేక మహోత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. అఖిల భారత శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్ట్ ఆహ్వానం మేరకు పవన్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పవన్ వస్తున్నారని తెలిసి అభిమానులు కూడా వచ్చారు. పలుచోట్ల జనసేన నినాదాలతో మార్మోగింది. హెలిప్యాడ్ నుంచి అమ్మవారి ఆలయం రాకముందు వరకు అభిమానులు పూలవర్షం కురిపించారు. నినాదాలు చేశారు.