అమరావతిపై కౌంటర్ దాఖలుకు పవన్ కసరత్తు... రేపు నేతలతో టెలికాన్ఫరెన్స్...
ఏపీ రాజధాని అమరావతిని విశాఖకు తరలించడంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కూడా తమ అభిప్రాయం చెప్పే అవకాశం ఇచ్చింది. దీంతో మూడు రాజధానుల ఏర్పాటు, అమరావతి భవిష్యత్తు వంటి అంశాలపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలతో కౌంటర్లు దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఇదే కోవలో జనసేన పార్టీ కూడా హైకోర్టులో కౌంటర్ దాఖలుకు కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే అమరావతి విషయంలో రైతులకు అండగా ఉంటామని ప్రకటించిన జనసేన పార్టీ... ఈ మేరకు చేపట్టాల్సిన కార్యాచరణ, హైకోర్టులో దాఖలు చేయాల్సిన కౌంటర్పై చర్చించబోతోంది. రేపు ఉదయం 11 గంటలకు జనసేనాని పవన్ పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు తీసుకుంటారు. అనంతరం జనసేన పార్టీ కార్యాచరణ ఖరారు చేస్తారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు చెందిన నేతలతో చర్చించాకే అమరావతిపై తుది నిర్ణయం తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న తాము ఆ పార్టీ అభిప్రాయాన్ని కూడా ప్రతిబింబించేలా తుది నిర్ణయం తీసుకుంటే బావుంటుందనే భావన జనసేన నేతల్లో వ్యక్తమవుతోంది. రాజధాని విషయంలో కేంద్రం జోక్యంపై తొలుత ఎక్కువగా మాట్లాడిన పవన్ కళ్యాన్ ఆ తర్వాత బీజేపీ స్పందనతో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో అమరావతి రైతులకు అండగా నిలవాలని ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తాము కూడా ఫాలో అయితే ఎలా ఉంటుందనే అంశంపై జనసేన చర్చించబోతోంది. దీంతో పాటు తమ పార్టీ అజెండా ప్రకారం మూడు రాజధానులపై అభిప్రాయాన్ని కూడా హైకోర్టుకు సమర్పించే కౌంటర్లో స్పష్టం చేయనుంది.