ఏపీ సర్కార్కు హైకోర్టు మరో షాక్, ఈసారి వేతనాలు, పెన్షన్లపై ఆదేశాలు.. మొత్తం చెల్లించాల్సిందే..
ఇటీవల బిల్లులపై స్టేటస్ కో విధించిన ఏపీ హైకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చింది. జీతాలు, పెన్షన్లపై కీలక ఆదేశాలు జారీచేసింది. కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ విధించడంతో జీతాలు, పెన్షన్లు 50 శాతం మాత్రమే చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దానిని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఊరట కలిగింది. వారి వేతనాలు వారికి మొత్తం ఇచ్చేయాలని స్పష్టంచేసింది.
50 శాతం వేతనాలు, పెన్షన్లు చెల్లించాలనే ప్రభుత్వ జీవోలను హైకోర్టు కొట్టివేసింది. మార్చి, ఏప్రిల్ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ల బకాయిలను 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కరోనా, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా 50 శాతం మాత్రమే చెల్లిస్తామని ప్రభుత్వం జీవోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ వారు వేతనంతో జీవించాల్సి ఉన్నందున.. వేతనం, పెన్షన్ మొత్తం అందజేయాలని స్పష్టంచేసింది. విశాఖపట్టణానికి చెందిన రిటైర్డ్ జడ్జి కామేశ్వరి పిటిషన్పై మంగళవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగులు, పెన్షనర్లకు మొత్తం నగదు అందజేయాలని రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు కూడా ప్రభుత్వాన్ని కోరారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలని సీఎం జగన్కు విన్నవించారు. వారు వేతన జీవులను.. ఇబ్బంది పెట్టొద్దని కోరారు. ఆ తర్వాతే కోర్టు కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది.