చంద్రబాబు అడగటమే తప్పా.. ప్రజావేదిక కూల్చితే ఏం లాభం.. టీడీపీ నేతల ఆగ్రహం
అమరావతి : ఆంధ్రప్రదేశ్లొ అధికార, ప్రతిపక్షం మధ్య యుద్ద వాతావరణం కనిపిస్తోంది. ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పక్కన నిర్మించిన ప్రజావేదికను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో టీడీపీ, వైసీపీ మధ్య వైరం మరింత ముదిరింది. అయితే చంద్రబాబు నివాసాన్ని బుధవారం కూల్చివేస్తామంటూ స్వయంగా సీఎం జగన్ వ్యాఖ్యానించడం మరింత దుమారం రేపుతోంది.
చంద్రబాబునాయుడుకు జగన్ సర్కార్ గట్టి ఝలక్ ఇచ్చింది. టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదిక తమకు కేటాయించాలంటూ చంద్రబాబు రాసిన లేఖను సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి తిరస్కరించడం చర్చానీయాంశమైంది. అంతేకాదు ఉండవల్లిలోని ప్రజావేదికను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడం టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అదలావుంటే చంద్రబాబు ఇల్లును కూడా కూల్చివేస్తామనడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
కలిసిరాని అసెంబ్లీ.. ఊపు తెప్పించిన లోక్సభ.. ఇక మున్సిపల్ పోరులో నిలిచి గెలిచేనా?
ప్రజావేదికను నిర్మించింది ప్రజా సమస్యల పరిష్కారం కోసమని.. ఇప్పుడు దాన్ని కూల్చివేయాలని సీఎం జగన్ నిర్ణయించడం సరికాదని తప్పుపడుతున్నారు టీడీపీ నేతలు. ఆయన నిర్ణయాన్ని ప్రజలు ఏమాత్రం హర్షించబోరని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా తమ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజావేదిక కేటాయించాలని అడగడంతో కూల్చివేయాలని జగన్ నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆరోపించారు.
ప్రజావేదికను కూల్చాలనుకోవడం ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యగా వారు అభివర్ణించారు. ప్రజావేదిక కూల్చివేత నిర్ణయంపై సీఎం జగన్ పునరాలోచించాలని కోరారు. కరకట్టపై అక్రమ నిర్మాణాలు ప్రారంభమైంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాదా అంటూ ప్రశ్నించారు.