ఇనామ్ భూములకు ఓకే .. ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం ... 6 లక్షల మందికి ప్రయోజనం
అమరావతి : గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న ఇనామ్ భూముల సమస్య తీరనుంది. 1957 నుంచి 2013 వరకు రిజిస్ట్రేషన్ అయిన భూములకు రైత్వారీ పట్టాలు చెల్లుబాటు అయ్యేలా ... వాటిపై ఎలాంటి నిషేధ ఆంక్షలు లేకుండా ఏపీ ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి రాజముద్ర పడింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఆర్డినెన్స్ కు సంబంధించి ఆదేశాలను రెవెన్యూశాఖ జారీచేయనుంది. దీంతో లక్షలాది మంది రైతులు, భూ యజమానులకు మేలు జరగనుంది. 3.23 లక్షల ఎకరాల భూమి నిషేధ జాబితా నుంచి బయటపడటంతో దాదాపు 6 లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది.
ఏంటీ ఇనామ్ ..? ఎలా కేటాయించారు ..?
దేశానికి స్వాతంత్ర్య రాక ముందు రాజులు, జమీందార్ల వద్ద వివిధ వృత్తి వారు పని చేసే వారు. ఆ కాలంలో నగదు చెలామణి ఉన్నా .. సాగుచేసుకోమ్మని భూములను ఇనామ్గా ఇచ్చేవారు. ఆ తర్వాత ఆలయాల పరిధిలోనూ ఈ విధానం అమల్లోకి వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చాక రాజులు, జమీన్, సంస్థానాలు రద్దయిపోయాయి. 1956లో ఇనామ్ రద్దు చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇనామ్ పేరుతో సాగు చేస్తున్న భూములు, వాటిని పొందిన వారిని గుర్తించి .. వారి వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి రైత్వారీ పట్టాలు అందజేసింది. 1957లో ఇనామ్ రద్దు-రైత్వారీ పట్టాలుగా మార్పిడి చట్టం తీసుకొచ్చింది. అప్పటినుంచి 2013 వరకు లక్ష ఎకరాలకు రైత్వారీ పట్టాలు ఇచ్చారు.
భూముల దుర్వినియోగంతో చట్ట సవరణ ..?
గుంటూరు, జగ్గయ్యపేట, అన్నవరం, ప్రకాశం జిల్లాలోని 32 గ్రామలన్నీ ఇనామ్ పరిధిలోనివే. ఆ తర్వాత సాగుభూముల్లో నగరాలు పుట్టుకొచ్చాయ. ఇళ్లు వెలిసాయి. సగం గుంటూరు నగరం, జగ్గయ్యపేట ఇనామ్ భూములతోనే డెవలప్ అయ్యాయి. అయితే 2006 నుంచి 2012 మధ్యలో ఇనామ్ భూముల దుర్వినియోగం భారీగా పెరిగింది. సేవలు అందించని వారు .. గ్రామాలతో సంబంధం లేని వారు తాము సర్వీస్ చేశామని చెప్పి విలువైన భూముల నుంచి రైత్వారీ పట్టాలు పొందారు. వాస్తవాలను పరిశీలించాల్సిన రెవెన్యూశాఖ పైరవీకారులకు ఎర్రతివాచీ పరిచి పట్టాలు ఇచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై తీవ్ర దుమారం చెలరేగడం .. కోర్టు కేసులు కావడంతో 2013లో ఇనామ్ చట్ట సవరణ ప్రతిపాదనను తీసుకొచ్చారు. వరుస సర్వీసులో ఉండేవారికి ఇనామ్ భూములపై ప్రయోజనం పొందే హక్కు ఉండాలని, ఎవరి పేరుతో రైత్వారీ కొత్తగా పట్టాలు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎప్పటినుంచి అమలు చేయాలి .. కొత్త పట్టాలు ఎప్పటినుంచి ఇవ్వకూడదనే అంశాలను రెవెన్యూశాఖ విస్మరించింది.
రెవెన్యూశాఖ నిర్లక్ష్యం ఖరీదు ..?
రైత్వారీ పట్టాల జారీలో అక్రమాలను అరికట్టేందుకు 2013 తర్వాత కొత్తగా ఎవరికీ రైత్వారీ పట్టాలు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ప్రాస్పెక్టివ్ విధానం కిందకు వస్తోంది. కానీ 1956 నుంచి ఇచ్చిన రైత్వారీ పట్టాలు కూడా చెల్లవని రెట్రాస్పెక్టివ్ చట్టసవరణలో రెవెన్యూ అధికారులు చేర్చారు. ప్రాస్పెక్టివ్ విధానానికి బదులు రెట్రాస్పెక్టివ్ అమలువుతుందని తెలియజేయడంతో 1956 నుంచి 2013 వరకు జారీచేసిన రైత్వారీ పట్టాలు రద్దయిపోయాయి. ఆ భూములన్నీ ప్రభుత్వ జాబితాలోకి వచ్చాయి. ఆ భూములపై అప్పటికే క్రయవిక్రయాలు జరిగినా .. చట్టసవరణ కారణంగా ప్రభుత్వానివిగా భావించి పరిరక్షణ పేరుతో రిజిస్ట్రేషన్ చట్టం 1908 ప్రకారం నిషేధ భూుముల జాబితా 22-ఏలో చేర్చారు. దీంతో గత ఐదేళ్లుగా ఆ భుములపై క్రయ, విక్రయాలు నిలిచిపోయాయి.
హక్కుదారుల ఆందోళనతో దిద్దుబాటు చర్యలు
తమ భూములను నిషేధ జాబితా 22 -ఏ లో చేర్చడంపై బాధితులు ఆందోళన చేపట్టారు. దీనిపై ఆరాతీసిన సీఎం చంద్రబాబు .. పట్టాలిచ్చిన భూములను ఎందుకు రద్దుచేశారని అధికారులను ప్రశ్నించారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించడంతో .. తక్షణ పరిష్కారం కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని సూచించారు. ఇందుకు సీఎం సమ్మతించడంతో రెవెన్యూశాఖ ఆర్డినెన్స్ రూపొందించి గత నవంబర్ 26న రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదించారని హోంశాఖ నుంచి సమాచారం రావడంతో ఆ భూమి యజమానుల సుదీర్ఘ కల నెరవేరబోతోంది.
ఇనామ్ భూములపై క్లారిటీ ..
ఆర్డినెన్స్ లో ఏపీ సర్కార్ రెండు కీలక అంశాలను చేర్చింది. ఇనామ్ రద్దు చట్టం 1956 అమల్లోకి వచ్చినప్పటి నుంచి 2013 వరకు ఇచ్చిన రైత్వారీ పట్టాలు చెల్లుబాటవుతాయని స్పష్టంచేసింది. రైత్వారీ పట్టాలు ప్రాస్పెక్టివ్ విధానంలో .. 1957 నుంచి 2013 వరకు ఇచ్చినవి చెల్లుతాయనే అంశంపై క్లారిటీ ఇచ్చింది. ఇందులో రెట్రాస్పెక్టివ్ అనే పదం తొలగించడంతో .. మళ్లీ భవిష్యత్ లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండే అవకాశం ఉండదు. 2013 తర్వాత సర్వీసు ఇనామ్ లకు ఎలాంటి రైత్వారీ పట్టాలు ఇవ్వకూడదని ఆర్డెనెన్స్ లో చేర్చారు.