ఈ నెల 25న జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ వాయిదా- జగన్ ఢిల్లీ టూర్ కోసమేనా ?
ఏపీలో ఈ నెల 25న జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది. కేబినెట్ భేటీని అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం నోట్ విడుదల చేసింది. అయితే కేబినెట్ భేటీకి వారం రోజుల ముందే నిర్ణయం కావడం, ఐదు రోజుల ముందే వాయిదా వేస్తున్నట్లు వచ్చిన ప్రకటన చూస్తుంటే దీని వెనుక కీలకమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంటున్న వైసీపీ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. సుస్ధిర ప్రభుత్వం నడుపుతున్నా భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు న్యాయస్ధానాలతో పాటు కేంద్రం వద్దా ఊరట లభించడం లేదు. దీంతో వైసీపీ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా వీటిని ఓ కొలిక్కి తీసుకురాలేకపోతే భవిష్యత్తులో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవు. అందుకే ఇప్పుడు సీఎం జగన్ కేంద్రంతో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమవుతున్నారు.
ఏపీలో టీడీపీ హయాంలో సాగిన అమరావతి భూముల దందాతో పాటు ఫైబర్ గ్రిడ్ స్కాంపైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐ దర్యాప్తు జరిపించాలని నిర్ణయించింది. అయితే ఇందుకు కేంద్రం అనుమతి కావాల్సి రావడంతో ఆ మేరకు లేఖ కూడా రాశారు. కానీ కేంద్రం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ప్రమేయం ఉందని భావిస్తున్న ఈ స్కాంలపై సీబీఐ దర్యాప్తు విషయంలో ఆసక్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు.
Recommended Video
రాజకీయంగా తీవ్ర కలకలం రేపే అవకాశం ఉన్న ఈ అంశంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. దీంతో ఎలాగైనా కేంద్రాన్ని ఒప్పించి ఈ రెండు అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షా అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. అపాయింట్మెంట్ దొరికితే ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి కేబినెట్ భేటీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై సీఎంవో నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.