త్రిశంఖు స్వర్గంలో చిన్నమ్మ..! రాజకీయ అడుగులు ఎటువైపో..!!
అమరావతి/ హైదరాబాద్ : నందమూరి ఆడపడచుగా, రాజకీయంగా ఎన్టీఆర్కు అసలు సిసలైన వారసురాలిగా గుర్తింపు తెచ్చుకున్న నేత దగ్గుబాటి పురందేశ్వరీ. కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్నారు. హస్తం నేతలు కూడా ఆమెను ఎన్టీఆర్ కూతురుగా నెత్తిన పెట్టుకున్నారనే చెప్పాలి. అయితే అది గతం..! ప్రస్తుతం బీజేపితో ఇమడలేక, బయటకు రాలేక, ఏపార్టీతో వెళ్లాలో తెలియక పురందేశ్వరీ గందరగోళ పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. కుమారున్ని, భర్తను ప్రతిపక్ష పార్టీలోకి పంపించినా తాను మాత్రం త్రిశంఖు స్వర్గంలో ఉన్నట్టు తెలుస్తోంది.
బీజేపిలో ఇమడలేక పోతున్న పురందేశ్వరి..! ప్రత్యామ్నాయ పార్టీ వైపు అడుగులు..!!
2014లో కాంగ్రెస్ నుంచి బయటకు రావటం, బీజేపీ గూటిలోకి చేరటం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కానీ పురందేశ్వరీ బీజేపీలో కొనసాగుతారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఐదారు నెలల నుంచి చిన్నమ్మ ఫ్యాన్ కిందకు చేరతారంటూ ప్రచారం ఊపందుకుంది. కానీ ఆమె మాత్రం మౌనంగానే ఉన్నారు. కమలం గూటిలో ఇమడలేక మరో ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారనేది మాత్రం తెలుస్తూనే ఉంది.
భర్త,కుమారుడు వైసీపిలోకి..! తానేపార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేకపోతున్న చిన్నమ్మ..!
ఇటువంటి సమయంలో ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరావు తనయుడు హితేష్ లోటస్పాండ్లో రాజకీయం నడిపారు. వైఎస్ జగన్తో బేటీ అయ్యారు. పైగా పర్చూరు సీటు తనయుడికే కన్ఫామ్ అయినట్లు బహిరంగంగా చెప్పుకొచ్చారు. కాబోయే సీఎం జగన్ అంటూ దగ్గుబాటి కుటుంబం ఏకంగా వైఎస్ తనయుడిని నెత్తిన పెట్టుకుంది. అసలే ప్రభుత్వ వ్యతిరేకత కొంప ముంచుతుందనే ఆందోళన పడు తున్న చంద్రబాబుకు ఇది ఊహించని షాకే..!
విమర్శల పాలవుతున్న దగ్గుబాటి కుటుంబం..! మోదీ చేతిలో కీలుబొమ్మలని ఆరోపణలు..!!
అందుకే.. దగ్గుబాటిని లక్ష్యంగా చేసుకుని విమర్శలకు పదను పెట్టారు. పార్టీలు మారటం ఆయనకు అలవాటేనంటూ ఘాటుగానే స్పందించారు. మరోవైపు బుద్దా వెంకన్న వంటి నేతలు, ఇదంతా మోదీ ఆడుతున్న డ్రామాగా. దానిలో పురేందేశ్వరీ కీలకమంటూ ఆరోపణలు చేశారు. ఇటువంటి కీలకమైన వేళ పురందేశ్వరీ బయటకు వచ్చి, వ్యక్తిగత జీవితం గురించి స్పందించటం భావ్యం కాదంటూ తెలుగు తమ్ముళ్లకు హెచ్చరికలాంటి సూచన చేశారు.
ఫామిలీ సెంట్ మెంట్ ను నమ్ముకున్న చిన్నమ్మ..! ఎన్టీఆర్ కుమార్తెగా ప్రజలు ఆదరిస్తారా..?
అయితే ఎన్నికలు ముందు ఇటువంటి మాటలు ఎన్టీఆర్ కూతురు అనే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే, ఎన్టీఆర్ సెంటిమెంట్ టీడీపీ కంటే విపక్షాలకు కలసివస్తుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటువంటి సమయంలో పురందేశ్వరీ రాజకీయాలకు దూరమవుతారా! భర్తతో కలసి వైసీపీతో కలసి నడుస్తారా అన్న అంశం ఆసక్తిని రేపుతోంది.