దేశమంతా రెయినీ సీజన్.. అమరావతిలో మాత్రం ట్వీట్ల సీజన్..! పార్టీల మద్య నడుస్తోన్న కామెంట్ల యుద్దం..!!
విజయవాడ/హైదరాబాద్ : చూడడానికి వర్షాకాలం నడుస్తున్నా ఏపిలో మాత్రం ట్వీట్ల కాలంగా మారింది. అదికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య సోషల్ మీడియాలో యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ నేత లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే ధీటుగా వైసీపీ నేత విజయసాయి సమాదానమిస్తున్నారు. సీఎం జగన్పై ట్విట్టర్లో నారా లోకేష్ విమర్శలు చేశారు.
'కొంచెమన్నా సోయి ఉండాలి సీఎం జగన్ గారు. విత్తనాల కొరతకు గత ప్రభుత్వం ఎలా కారణమవుతుంది? ఏపీ నుంచి తెలంగాణ సర్కార్ 10వేల క్వింటాళ్ల విత్తనాలు కొనుగోలు చేసింది. ఇదేమన్న ఇడ్లీనా, ఉప్మానా రాగానే విత్తనాలు ఇవ్వడానికన్న వైసీపీ ప్రభుత్వం.. ఏపీ రైతులకు అందాల్సిన విత్తనాలు తెలంగాణకు ఎలా వెళ్లాయో చెప్పాలి' అని ట్విట్టర్లో లోకేష్ ప్రశ్నించారు. లోకేష్పై ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనేమో... జాకీలు పెట్టి లేపుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
కొత్త ప్రభుత్వం వచ్చి ఐదువారాలే అయ్యిందన్న స్పృహ కూడా లేకుండా... లోకేష్ ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కొడుకు, మంత్రి అయి ఉండి మంగళగిరిలో ఓడినప్పుడే లోకేష్ సత్తా ఏంటొ తెలిసిందని విజయసాయిరెడ్డి విమర్శించారు. మరోవైపు ఎంపీలు సుజనా, సీఎం రమేష్, టీజీ వెంకటేష్పై కేశినేని నాని ట్విట్టర్లో విమర్శలు చేశారు.
'మీరేదో ఏపీని ఉద్ధరించడానికే బీజేపీలోకి వెళ్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. కానీ బడ్జెట్ చూశాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైంది. మిమ్మల్ని ఉద్ధరించుకోవడానికే బీజేపీలోకి వెళ్లారు' కేశినేని నాని ఆరోపించారు. పెట్రోల్ ధరల పెంపుపై టీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్విట్టర్లో ఫైర్ అయ్యారు. గతంలో పెట్రోల్ ధరల పెంపును ప్రధాని మోదీ వ్యతిరేకించారని, ప్రజలపై వేలకోట్ల భారం పడుతుందని మోదీ అన్నారని, గతంలో మోదీ చేసిన ట్వీట్ని కేటీఆర్ ట్యాగ్ చేశారు.