వ్యూస్ సునామీ: రావాలి జగన్..కావాలి జగన్ ప్రచార గీతం: యూట్యూబ్ లో 4 రోజుల్లో 83 లక్షలు
అమరావతి: ఎన్నికల ప్రచార సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి, వారిని ఉత్తేజితులను చేయడానికి పాటల ఆల్బమ్ లను రూపొందించుకోవడం సహజమే. ఇదివరకు తరలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా అంటూ టీడీపీ పలు పార్టీ ప్రచార గీతాలను రూపొందించి, జనం మీదికి వదిలింది. భారతీయ జనతా పార్టీ కూడా నరేంద్రమోడీ కేంద్రంగా చేసుకుని కొన్ని ఆల్బమ్ లను తయారు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఆ పార్టీ నాయకులు ఇప్పటికే పలు ఆల్బమ్ లను రూపొందించి, సోషల్ మీడియాలో విడుదల చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 14 నెలల పాటు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో సాగించిన పాదయాత్రలో అనేక పాటలు విడుదలయ్యాయి. తరువాత కూడా పాటలను రూపొందిస్తోందా పార్టీ.
రావాలి జగన్.. కావాలి జగన్ అనేది వైఎస్ఆర్ సీపీ స్లోగన్. దీన్నే పల్లవిగా తీసుకుని ఓ పాటను రాయించారు. తెలంగాణకు చెందిన ప్రముఖ గేయ రచయిత, అభ్యుదయవాదిగా పేరున్న సుద్దాల అశోక్ తేజ రాసిన పాట ఇది. ఫిదా చిత్రానికి సంగీతాన్ని అందించిన శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని కంపోజ్ చేశారు. మనో పాటను ఆలపించారు. జగన్ పాదయాత్రలోని కొన్ని హత్తుకునే ఘటనలను ఎంపిక చేసుకుని, పాటను రూపొందించారు.
లేటెస్ట్ గా ఈ పాట యూట్యూబ్ సెన్సేషన్ గా మారింది. వ్యూస్ సునామీని సృష్టిస్తోంది. ఈ నెల 25వ తేదీన వైఎస్ఆర్ సీపీ నాయకులు ఈ పాటను యూట్యూబ్ లో విడుదల చేశారు. కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లోనే 83 లక్షల మంది ఈ పాటను చూశారు. సినిమా పాటలతో పోల్చుకుంటే- ఈ సంఖ్య తక్కువే అనుకోవచ్చు. బట్- ఓ పార్టీ ఎన్నికల ప్రచార గీతానికి నాలుగు రోజుల వ్యవధిలో ఇన్ని లక్షల మంది చూడటం ఇదే తొలిసారి అని అంటున్నారు. సినిమా పరిభాషలో చెప్పుకోవాలంటే ఆల్ టైమ్ రికార్డ్గా అభివర్ణిస్తున్నారు పార్టీ అభిమానులు. యువతను విపరీతంగా ఆకట్టుకోవడం వల్లే ఈ రికార్డు సాధ్యపడిందనేది వారి వాదన. ఈ పాటను వీక్షించిన వారిలో 20 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు వారు సంఖ్య అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ సినీ పాటకు ధీటుగా జగన్ పై రాసిన గీతాన్ని ప్రజలు అభిమానిస్తున్నారని అంటున్నారు. రోజులు గడిచే కొద్దీ పాటను చూసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.