డిసెంబర్ నెలాఖరుకల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆర్టీజిఎస్ కేంద్రాల ఏర్పాటు:సిఎం చంద్రబాబు
అమరావతి:రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రియల్టైం గవర్నెన్స్ సిస్టెమ్(ఆర్టీజిఎస్) కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఆర్టీజిఎస్ సాధించిన విజయాల స్ఫూర్తితో సిఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సోమవారం నీరు-ప్రగతి అధికారులతో సిఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐదు నదులను అనుసంధానం చేసి ఆంధ్రప్రదేశ్ ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని సిఎం చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం మరో చరిత్ర కానుందని అన్నారు.
రియల్టైం గవర్నెన్స్ సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఆర్టీజిఎస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబు నిర్ణయించారు. డిసెంబర్ నెలాఖరుకల్లా ఆర్టీజిఎస్ కేంద్రాల ఏర్పాటును పూర్తిచేయాలని అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం ఉపాధి కల్పనలో మన రాష్ట్రమే ముందుందన్నారు. సంక్షేమ పథకాలను బయోమెట్రిక్ పద్దతిలో అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు. అలాగే శాఖపరమైన నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంలోనూ ఎపీనే అగ్రస్థానంలో ఉందన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్లోనూ మనమే ముందుండాలి అని సిఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
రాష్ట్రంలో ప్రతియేటా సముద్రంలోకి వృధాగా పోయే 3 వేల టిఎంసిల నీటిని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే తద్వారా అంత సంపదను సృష్టించవచ్చని చంద్రబాబు చెప్పారు. సూక్ష్మ సేద్యం పద్దతి ద్వారా అనంతపురం జిల్లాలో అద్భుత ఫలితాల్ని సాధించామని చంద్రబాబు తెలిపారు. అక్కడ తీవ్ర వర్షాభావం పరిస్థితులు ఉన్నప్పటికీ సమర్ధ జల నిర్వహణ ద్వారా దిగుబడులు తగ్గకుండా చూస్తున్నామని వివరించారు.. మైక్రో ఇరిగేషన్ ద్వారా ఉత్పాదకత 29 శాతం పెరిగిందని చెప్పారు.
మనిషి ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తామో...అలాంటి శ్రద్దనే పంటలపై కూడా చూపాలని సిఎం చంద్రబాబు ఉద్భోదించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గోకులం, మినీ గోకులం పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశుగణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనీ, అప్పుడే రైతుకు రెండు విధాలుగా ఆదాయం పెరుగుతుందనీ సూచించారు. చిత్తూరు, అనంతపురంలో సెరీకల్చర్ను ప్రోత్సహించాలన్నారు. ఆదరణ-2 పనిముట్ల పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇటీవల నిర్వహించిన బోట్రేసింగ్, ఎయిర్షోలతో అమరావతి ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో పెరిగిందని...అందరి దృష్టీ అమరావతి వైపు మళ్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఐదు నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దవచ్చని...అదే తన సంకల్పమన్నారు. ఇదిలావుంటే విశాఖపట్నంలో డిసెంబరు 2, 3 తేదీల్లో జరిగే నేషనల్ బాడీబిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు హాజరు కావాలని ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి కోరారు.