ప్రభుత్వ పనితీరు అద్భుతం: 12 లక్షలమందికి పైగా పరీక్షలు రాస్తే.. ఒక్క పొరపాటూ దొర్లలేదు!
అమరావతి: ఆయన ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి. మొన్నటి దాకా ఎన్నికల ప్రధాన అధికారిగా అందరి నోళ్లలోనూ నానిన అధికారి. ప్రభుత్వ పనితీరును ప్రశంసల్లో ముంచెత్తారు. 12 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఒకేసారి పరీక్షలు రాయాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం అద్బుతంగా పని చేసిందని కితాబిచ్చారు. రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం గానీ, జిల్లా పాలనా యంత్రాంగం గానీ ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. ఆయనే- గోపాలకృష్ణ ద్వివేది. రాష్ట్రంలో ఆదివారం తొలి విడతగా ముగిసిన గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షలకు ఒకేసారి 12 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరు కావాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం.. అధికార యంత్రాంగం చక్కని సమన్వయాన్ని కనపర్చిందని అన్నారు. మిగిలిన పరీక్షలకు కూడా ఇదే రకమైన ఫలితాలు రావాలని ఆయన అకాంక్షించారు. ఈ మేరకు ద్వివేది ఆదివారం ట్వీట్ చేశారు.
15 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరు..
నిజానికి- గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం పరీక్షలకు 12 లక్షల 58 వేల 974 మందికి హాల్ టికెట్లను జారీ చేయగా.. వారిలో తొలి రోజు పరీక్షకు 11,58,538 మంది హాజరయ్యారు. తమ భవిష్యత్తును పరీక్షించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 5314 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం ఆరంభమైన ఈ పరీక్షలు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగుతాయి. తొలిరోజు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5, మహిళా పోలీసులు, సంక్షేమ విద్యా కార్యదర్శి, వార్డు పరిపాలనా కార్యదర్శి ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించారు. తొలి రోజు రెండు విడతల్లో పరీక్షలను నిర్వహించారు జిల్లా అధికారులు. నిమిషం పాటు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకున్నా.. లోనికి వెళ్లడానికి అనుమతి లభించదంటూ అధికారులు ముందుగానే హెచ్చరించారు.
వీడియో: నల్లమల అడవుల్లో పోలీసు జీపెక్కిన గ్రామ సచివాలయ పరీక్ష అభ్యర్థులు!
అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు
అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రతి జిల్లాలనూ సుమారు 600 బస్సులను అందుబాటులో తీసుకొచ్చింది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. పరీక్షలన్నీ సజావుగా ముగియడానికి ప్రభుత్వం చేసిన ఆయా ప్రయత్నాలన్నీ సత్ఫలితాలను ఇచ్చాయని గోపాలకృష్ణ ద్వివేది వ్యాఖ్యానించారు. దీని ఫలితంగానే- తొలిరోజు ఎక్కడా ఎలాంటి పొరపాట్లు గానీ, తప్పులు గానీ చోటు చేసుకోలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం మొదలుకుని, కిందిస్థాయి ఉద్యోగుల వరకు చక్కని సమన్వయంతో పని చేయడం వల్లే ఇది సాధ్యపడిందని ఆయన కితాబిచ్చారు. ఇక ముందు జరిగే పరీక్షల నిర్వహణ కూడా ఇదే విధంగా విజయవంతం కావాలని అకాంక్షించారు.
జిల్లాల వారీగా అభ్యర్థుల వివరాలివీ..
విజయనగరం- 55095, శ్రీకాకుళం-65980, పశ్చిమ గోదావరి-80392, చిత్తూరు-100409, కడప-76927, నెల్లూరు-73797, తూర్పు గోదావరి-115698, అనంతపురం-92865, విశాఖపట్నం-121821, కర్నూలు-106258, గుంటూరు-102447, ప్రకాశం-69496, కృష్ణా-101982 మంది అభ్యర్థులు తొలిరోజు పరీక్షలను రాశారు.