సీనియర్ ఐపీఎస్..కేంద్రం నుంచి రిలీవ్! రాష్ట్రంలో కీలక హోదా!
అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి పీ సీతారామాంజనేయులు కేంద్రం నుంచి రిలీవ్ అయ్యారు. ఆయనను రిలీవ్ చేస్తూ కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించింది. 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన పీ సీతారామాంజనేయులు కొంతకాలంగా డెప్యుటేషన్పై కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఐజీగా పనిచేస్తున్నారు.
వైఎస్ జగన్ సర్కార్కు మరో గిఫ్ట్: అనంతపురం-అమరావతి ఎక్స్ప్రెస్ వే కోసం నిధులు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఆయన మళ్లీ రాష్ట్రానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. దీనికితోడు- వైఎస్ జగన్ కూడా ఆయనను రాష్ట్రంలో కీలక హోదాను అప్పగించడానికి ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర సర్వీసుల్లో కొనసాగడానికి వీలుగా తనను రిలీవ్ చేయాలని కోరుతూ కొద్దిరోజుల కిందటే ఆయన కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఆ శాఖ సానుకూలంగా స్పందించింది. ఆయనను రిలీవ్ చేసింది. సీతారామాంజనేయులు రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ధృవీకరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన వెయిటింగ్లో ఉన్నారని, త్వరలోనే పోస్టింగ్ ఇవ్వనున్నట్లు ఆయన ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా- ఆంజనేయులుకు రవాణాశాఖ కమిషనర్ బాధ్యతలను అప్పగించవచ్చని తెలుస్తోంది.
వీఎస్ కౌముది కూడా?
రాష్ట్రానికే చెందిన మరో సీనియర్ ఐపీఎస్ అధికారి వీఎస్ కౌముది కూడా త్వరలోనే రాష్ట్ర సర్వీసుల్లో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా డెప్యుటేషన్పై కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. కేంద్రీయ రిజర్వ్ పోలీసు బలగాల (సీఆర్పీఎఫ్) అదనపు డైరెక్టర్ జనరల్గా ఆయన పనిచేస్తున్నారు. తనను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరుతూ కూడా ఇటీవలే హోమ్ మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. పీ సీతారామాంజనేయులు, వీఎస్ కౌముది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కీలక శాఖల్లో పనిచేశారు. వారి సేవలను వినియోగించుకోవడానికి వైఎస్ జగన్ ఆసక్తిగా ఉన్నారు.