సంచలనం:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు సిద్దమైన ఏసీబీ...పర్యవసానాలపై ఉత్కంఠ
అమరావతి:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దేశంలోనే ఒక అరుదైన చర్యకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాంది పలకనుంది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపైనే దాడులు జరిపే ఎసిబి ఇకపై ఏపీలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులపైనా దాడులు నిర్వహించనుంది.
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ మాత్రమే దాడులు నిర్వహించేదనే సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఎపి ప్రభుత్వం సిబిఐ దాడులకు సాధారణ అనుమతి ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ అసాధారణ చర్యకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ మేరకు ఎక్కడైనా ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదులు వస్తే దాడులకు సిద్ధంగా ఉండాలంటూ ఏసీబీకి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఆ అంశంపైనే...ప్రత్యేక సమావేశం
మరోవైపు రాష్ట్ర డీజీపీయే ఎసిబికి కూడా నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులపై దాడులకు సంబంధించి చర్చించేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు సమావేశమైనట్లు తెలిసిందని ఒక తెలుగు పత్రిక పేర్కొనడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఏసిబీ దాడులు నిర్వహిస్తే తలెత్తే న్యాయపరమైన ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చించినట్లు తమకు సమాచారం అందిందని ఆ పత్రిక వెల్లడించింది.
చర్చనీయాంశం...ప్రభావం
మరోవైపు దేశంలోనే అసాధారణ రీతిలో జరగబోయే ఈ దాడులతో ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనేది విద్యావంతుల్లో చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ పరిణామం కేవలం రాష్ట్రంపైనే కాకుండా దేశ రాజకీయాలపైనే ప్రభావం చూపుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ చర్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధ బాంధవ్యాలపై చర్చకు దారితీయడంతో పాటు అనేక రకాల కొత్త కొత్త చట్టాలు పుట్టుకు వచ్చేందుకు దోహదపడవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
అప్పుడు...ఇలా అన్నారు
రాష్ట్రంలో సిబిఐ అడుగుపెట్టేందుకు అనుమతి ఉపసంహరించుకుంటూ 'కన్సెంట్' ను ఉపసంహరించుకుంటూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంలో ఎపి ప్రభుత్వం ఏమని పేర్కొందంటే?...అంతర్గత విభేదాలతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రతిష్ఠ మసకబారిందని...అందువల్ల రాష్ట్రంలో ఇక ఆ సంస్థ జోక్యం అనవసరమని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సిబిఐ కంటే ఏసిబి పనితీరు బాగుందని కితాబునిచ్చింది.
పరిస్థితిపై...ఉత్కంఠ
అయితే సీబీఐకి అనుమతి ఉపసంహరిస్తూ ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఆ సందర్భంలో తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ఒక సంస్థపై ఆరోపణలు వస్తే ఆ సంస్థనే దర్యాప్తు చేయవద్దనడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని...అదెలాగంటే డాక్టర్ బాగా లేడని హాస్పిటల్ మూసేస్తామా అంటూ ఉదాహరణలతో వివరించారు. అయితే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకే సాగాలని నిర్ణయించుకున్న క్రమంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది.