ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి దెబ్బ.. 100 కోట్ల జరిమానా..!
అమరావతి : ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అదలావుంటే మరో వారంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాకిచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది.
పవన్ కల్యాణ్ సీఎం కావాలి..! వామ్మో గణేశా..! నీ పల్స్ దొరికేదెట్టయ్యా?
ఇసుక అక్రమ తవ్వకాలపై ఝలక్
ఎన్నికల వేళ అధికార పార్టీ టీడీపీకి ఊహించని దెబ్బ తగిలింది. పర్యావరణ సమతుల్యం దెబ్బతినేలా కృష్ణా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఎన్జీటీ తేల్చింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి సమీపంలోని కృష్ణా నది దగ్గర జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. వాటర్మ్యాన్ రాజేంద్రసింగ్, అనుమోలు గాంధీ పిటిషన్ దాఖలు చేశారు. ఆ మేరకు విచారించిన ఎన్జీటీ.. ఏపీ సర్కార్ కు భారీ జరిమానా విధించింది.
ఇసుకను తవ్వేస్తున్నారు..!
సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా, పర్యావరణానికి నష్టం కలిగించే విధంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనేది పిటిషనర్ల వాదన. దాంతో నది కోతకు గురయ్యే ప్రమాదముందని ఆరోపిస్తున్నారు. వీరి పిటిషన్ పై విచారణ జరిపిన కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు.. పూర్తి వివరాలతో ఎన్జీటికి నివేదిక సమర్పించారు. ప్రతి నిత్యం 2500 వాహనాల్లో ఇసుక తరలుతోందని.. 25 మీటర్ల లోతుగా ఇసుకను తవ్వి తీస్తున్నారని అందులో పేర్కొన్నారు.
గతంలో తమిళనాడుకు..!
ఫిబ్రవరి నెలలో సరిగ్గా ఇలాంటి మొట్టికాయలే పక్క రాష్ట్రానికి తగిలాయి. తమిళనాడు ప్రభుత్వానికి కూడా గట్టి షాక్ ఇచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నదుల్లోకి మురికినీరు ప్రవేశిస్తుంటే చూస్తూ కూర్చుంటారా అంటూ వంద కోట్ల జరిమానా విధించింది. బకింగ్ హాం తో పాటు మరో రెండు నదులను సంరక్షించే విషయంలో విఫలమయ్యారని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తమ ముందు హాజరు కావాలంటూ నోటీసులు పంపింది.