ఏపీలో రిజిష్ట్రార్ల రియల్ దందా..? నిబంధనలు బేఖాతరు, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రధాన శాఖలో రిజిష్ట్రేషన్ ఒకటి. ఆదాయాన్ని పెంచి.. ప్రభుత్వ ఖజానా నింపేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. కొత్త విధానాలను అమల్లోకి తీసుకొస్తున్నారు. అయితే కిందిస్థాయిలో ఉన్న అధికారులు మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. చేతివాటం ప్రదర్శిస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీంతో వారి జేబులు నిండుతున్నాయి. కానీ ప్రభుత్వ ఖజానాకు మాత్రం నగదు చేరడం లేదు.
291 సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు
ఏపీలో 291 సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి. 38 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రోజు 10 నుంచి 15 వేల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. మంచి ముహూర్తం ఉంటే రోజుకు 20 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం, తిరుపతి నగరాలతోపాటు కాకినాడ, ఏలూరు, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, సూళ్లూరుపేట, కావలి, నాయుడుపేట, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, బాపట్ల, తెనాలి సహా పట్టణాల్లో 40 వేలకు పైగా లే అవుట్లు ఉన్నాయి. ఆయా చోట్ల 20 శాతం మాత్రమే నిబంధనల మేరకు ఉండగా.. 80 శాతం అక్రమ లే అవుట్లు ఉన్నాయి. 40 శాతం లే అవుట్లకు కొన్ని అనుమతులు ఉన్నాయి.
అక్రమ లే అవుట్లపై కొరడా
అక్రమ లే అవుట్లపై సర్కార్ కొరడా ఝలిపించింది. కార్పొరేషన్, రెవెన్యూ శాఖ అనుమతి లేని రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. అక్రమ లే అవుట్లను రిజిస్ట్రేషన్ శాఖ గుర్తించి.. వాటికి సంబంధించిన సర్వే నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. దీనికి సంబంధించి అధికారులు/ సిబ్బందికి ఆదేశాలు కూడా జారీచేశారు. కానీ కొందరు కిందిస్థాయి సిబ్బంది ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. కొందరు రిజిస్ట్రార్లు, సిబ్బంది.. నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కొత్త లే అవుట్లకు సంబంధించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేస్తూ.. అందనికాడికి దోచుకుంటున్నారు.
కొత్త వెంచర్లకు నో పర్మిషన్
పట్టణ ప్రాంతాల్లో వెలసిన కొత్త వెంచర్లకు కూడా అనుమతులు లేవు. అనుమతి ఉన్న లే అవుట్లలో గల ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్దంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అక్రమ లే అవుట్లకు సంబంధించి సర్వే నంబర్ల జాబితాను నోటీసు బోర్డులో కూడా ఉంచారు. కానీ అవే వెంచర్లకు సమీపంలో వెలసిన కొత్త లే అవుట్లకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.
ఈ చర్యతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరేది. అనుమతి కోసం ఫీజును 10 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. కానీ ఇలా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరుగుతోంది.
భారీగా అక్రమాలు
రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొత్త రిజిస్ట్రేషన్లను ఒక్కసారి పరిశీలిస్తే రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న అక్రమాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది. నిబంధనలను తుంగలో తొక్కి.. అక్రమ ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేశారు. నెలరోజుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తెలుస్తున్నాయి.