మూడుసార్లు జస్ట్ మిస్: ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా! కారణాలివే
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఆయనకాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖను అందించనున్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సోమిరెడ్డి సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శాసన మండలి సభ్యత్వానికి (ఎమ్మెల్సీ) పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
మరో రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. సోమిరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఎన్నికల్లో పోటీకి దిగే ముందు సీరియస్నెస్ తగ్గకుండా ఉండేందుకు ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.
సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాడోపేడో తేల్చుకోవాలనే ఉద్దేశ్యంతో సోమిరెడ్డి ఉన్నారు. నియోజకవర్గంపై పూర్తిస్థాయి దృష్టిలో పెట్టాలంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడమే ఉత్తమమని భావించారట.
ఎన్నికలకు ముందు.. పవన్ కళ్యాణ్ సహా 3 ఫ్యాక్టర్స్: జగన్ పార్టీలో సరికొత్త ఉత్సాహం
సోమిరెడ్డి... సర్వేపల్లి నుంచి గత మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2004లో సోమిరెడ్డిపై కాంగ్రెస్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి 7వేలకు పైగా స్వల్ప మెజార్టీతో గెలిచారు. 2009లో కూడా కాంగ్రెస్ నుంచి ఆదాలనే విజయం సాధించారు. సోమిరెడ్డి 10వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. రెండో స్థానంలో నిలిచారు. 2014లో వైసీపీ కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. కేవలం 5వేల పై చిలుకు మెజార్టీతో ఓడిపోయారు.
మూడుసార్లు కూడా ఆయన స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అంతకుముందు 1994, 1999లలో విజయం సాధించారు. ఆ తర్వాత మూడుసార్లు వరుసగా 7వేలు, 10వేలు, 5వేల మెజార్టీతో ఓడిపోయారు. దీంతో ఈసారి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈసారి ఎలాగైనా గెలుపొందాలనే పట్టుదలతో ఉన్నారు.