అమరావతే ఏపీ రాజధాని, మోడీ ప్రధానిగా చెబుతోన్నా.. సోము వీర్రాజు సంచలనం
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రగడ నెలకొంది. 3 రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం పావులు కదపడంతో అగ్గిరాజేసింది. అయితే దీనిపై ఎప్పుడూ ఎవరో ఒక నేత మాట్లాడుతూనే ఉంటారు. సోమవారం ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు వంతు వచ్చింది. ఏపీ రాజధాని అమరావతి అని తేల్చిచెప్పారు. అంతేకాదు తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినిధిగా చెబుతున్నానని కామెంట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కట్టుబడి ఉన్నాం..
అమరావతిలోనే ఏపీ రాజధాని ఉండాలని.. మరో ఆలోచన లేదని సోము వీర్రాజు అన్నారు. తుళ్లూరులో భారతీయ కిసాన్ సంఘ్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. అమరావతిలో అద్భుత రాజధానిని బీజేపీ నిర్మించి ఇస్తుందని చెప్పారు. అమరావతి రైతులకు ఇచ్చిన ప్లాట్లు అన్నింటినీ రెండు వేల కోట్లతో బీజేపీ అభివృద్ధి చేస్తుందని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని కోరారు.
పనులు ఆగాయా..?
అమరావతిలోనే రాజధాని ఉండాలి అనేది బీజేపీ లక్ష్యం అని సోము వీర్రాజు అన్నారు. ఇందులో రెండో అంశానికి తావు లేదన్నారు. సీఎం జగన్ మూడు రాజధానులు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. 1800 కోట్లతో నిర్మిస్తోన్న ఎయిమ్స్ హాస్పిటల్ ఆగిందా అని ప్రశ్నించారు. దుర్గమ్మ ఫ్లై ఓవర్ పూర్తీ చేశామా లేదా అని అడిగారు. మోదీ ప్రతినిధిగా మాట్లాడుతున్నానని.. బీజేపీ.. జగన్ లాగా మాట తప్పదు...మడమ తిప్పదు అని స్పష్టంచేశారు. అమరావతి ఇక్కడే ఉండాలి అని.. బీజేపీ తరుపున ఉద్యమం చేస్తామని తెలిపారు.
5 వేల కోట్లు..
సీఎం వైఎస్ జగన్ వెంటనే రైతు నాయకులతో మాట్లాడాలి అని సూచించారు. రాజధానితో పాటు రైతులకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయాలని కోరారు. 64వేల ప్లాట్ పోగా మిగిలిన భూమిని అభివృద్ధి చేయాలని సూచించారు. దుర్గమ్మ, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్, ఎయిమ్స్ బీజేపీ వల్లే వచ్చాయని చెప్పారు. అమరావతి ఎక్స్ప్రెస్ హైవేకు కట్టుబడి ఉన్నామని వివరించారు. 2024 సంవత్సరంలో మాకు అధికారం ఇస్తే అమరావతిని రూ. 5000 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. రైతుల ప్లాట్లకు 2000 కోట్లతో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సోము వీర్రాజు హామీ ఇచ్చారు.