టిడిపికి 30 మంది స్టార్ క్యాంపెయినర్లు : వైసిపికి సినీ ప్రముఖులు : జనసేన లో పవన్ తో సహా...!
ఏపిలో ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. మూడు ప్రధాన పార్టీల అధినేతలే ఇప్పటి వరకు ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక, ఈ మూడు పార్టీల నుండి స్టార్ క్యాంపెయినర్స్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే టిడిపి తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్టు ప్రకటించింది. ఎన్నికల్లో పార్టీల తరపున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్స్ లిస్టు కు ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.
చంద్రబాబుగారూ! సామాన్యురాలిగా అడుగుతున్నా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? : వైఎస్ షర్మిళ
టిడిపి నుండి 30 మంది ..
తమ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంచేసే 30మంది స్టార్ కాంపెయినర్ల జాబితాను టీడీపీ విడుదల చేసింది. ఈ జాబి తా పూర్తిగా సామాజిక - ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసారు. చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ, దివ్య వాణి మాత్రమే ప్రముఖ ప్రచారం చేయనున్నారు. టిడిపి జాబితా లో అందులో సీఎం చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, నారా లోకేశ్, మాంగటి మురళీమోహన్, నందమూరి బాలకృష్ణ, వర్ల రామ య్య, జూపూడి ప్రభాకర్, నాగుల్మీరా, లంకా దినకర్, జి.కోటేశ్వరరావు, పంచుమర్తి అనురాధ, దివ్యవాణి, వైఎస్ చౌదరి, ఎండీ ఫరూక్, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, పోతుల సునీత, కాకి గోవిందరెడ్డి, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, వేమూరి ఆనంద్సూర్య, గుంటుపల్లి నాగేశ్వరరావు, దేవళ్ల మురళి, అంబికా కృష్ణ, పర్చూరి అశోక్బాబు, వంగవీటి రాధాకృష్ణ, విజయభారతి, రేవతి, చలమలశెట్టి రామానుజయ, ఎండీ హిదాయత్ పేర్లను ప్రకటించింది.
వైసిపి ప్రచారంలో సినీ పరిశ్రమ..
వైసిపి లో ఇప్పటి వరకు పార్టీ అధినేత జగన్ ప్రచారం లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 29 నుండి వైసిపి గౌర వాధ్యక్షురాలు విజయమ్మ, జగన్ సోదరి షర్మిళ తో సహా పార్టీ కి మద్దతుగా నిలుస్తున్న సినీ రంగ ప్రముఖులు ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. సినీ పరిశ్రమ నుండి ఆలీ, జయసుధ, పృధ్వీ, పోసాని కృష్ణ మురళీ,భాను చందర్, చిన్ని కృష్ణ, శివాజీ రాజా, రాజా రవీంద్ర తదితరులు ఉన్నారు. వీరు కాకుండా రోజా, రెహమాన్, కొత్తపల్లి సుబ్బారాయుడు, లావు రత్తయ్య తదితరుల పేర్లు సిద్దమయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ మామ అయిన నార్నే శ్రీనివాస రావు సైతం వైసిపి కి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఆయన ప్రధానంగా మంగళగిరి, చిలకలూరిపేట నియోజకవర్గాల మీద దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది. పార్టీలోని సీనియర్లు మొత్తం ఎన్నికల నిర్వహణ కోసం బాధ్యతలు అప్పగిస్తున్నారు.
జనసేన నుండి మెగా బ్రదర్స్..
ఇక, జనసేన నుండి పార్టీ అధినేత పవన్ కళ్యాన్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. ఆయన తో పాటుగా సోదరుడు నాగ బాబు ప్రస్తుతం నర్సాపురం నుండి జనసేన ఎంపి అభ్యర్దిగా బరిలో దిగారు. వీరిద్దరూ ఇప్పుడు పార్టీకి ప్రధాన ప్రచార కర్తలుగా మారారు. ఇక, బిఎస్పీ అధినేత్రి మాయావతి తో కలిసి పవన్ ఎన్నికల ప్రచారం లో పాల్గొంటారు. సిపిఐ, సిపి యం జాతీయ స్థాయి నేతలతో కలిసి రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభల్లో పవన్ హాజరవుతారు. ఇక, జేడి లక్ష్మీనారాయ ణ సైతం విశాఖ నగరంలో తన ప్రచారం తో పాటుగా ఎంపిక చేసిన నగరాల్లో ప్రచారం చేయనున్నారు.