ఆర్టీసీలో సమ్మె సైరన్ : చర్చలు విఫలం: నేడు తేదీల ఖరారు..!
ఏపి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగనుంది. ఆర్టీసి ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆర్టీసి కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నాయి. తమ డిమాండ్ల మీద ఆర్జీసి అధికారులతో యూనియన్ల నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో..బుధవారం సమ్మె తేదీలను ప్రకటించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
కేసీఆర్ రాకకు ముందు రోజే..అదే వ్యూహంతో : 13న అమరావతి సభ : జాతీయ నేతలకు బాబు ఆహ్వానం..!
కార్మిక సంఘాలతో చర్చలు విఫలం..
పలు డిమాండ్ల మీద విజయవాడలో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, ఈడీలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మెకు సిద్ధమవు తున్నామని చర్చల అనంతరం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ప్రకటించారు. ఉద్యోగులకు ఫిట్మెంట్ 50 శాతం ఇవ్వాలని తాము కోరుతుండగా, 20 శాతానికి మించి ఇచ్చేది లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం మొండికేయడాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.
ఏపీఎస్ ఆర్టీసీలో నష్టాలు
ఏపీఎస్ ఆర్టీసీలో నష్టాలకు ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలే కారణమని, నష్టాలు, అప్పులను ప్రభుత్వమే భరించా లని ఉద్యోగులు తేల్చిచెబుతున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తక్కువ జీతభత్యాలతో పనిచేస్తున్నామని, అయినా సర్కారు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. వేతన సవరణలో ఉన్న డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే ఆర్టీసీలోని ఎనిమిది సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి.
నేడు సమ్మె తేదీల ప్రకటన..
ఆర్టీసి ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సమ్మె తేదీని ప్రకటించేందుకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో చేపట్టబోయే సమ్మె సన్నాహక షెడ్యూల్ను కూడా ప్రకటించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. యాజమాన్యం ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు సంస్థలో సిబ్బందిని కుదిం చేలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని నేతలు ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో సిబ్బందిని తగ్గించడం, యూనియన్కు ఇచ్చే రాయితీలను రద్దు చేయడం వంటి చర్యలు కార్మికులను రెచ్చగొట్టేలా ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం ఫిట్మెంట్ తదితర డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించకపోతే సమ్మె తప్పదని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అయితే, మరోసారి ప్రభుత్వం కార్మిక సంఘాలను చర్చలకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.