స్వైన్ ఫ్లూ అలజడి ఒకవైపు ... రాజకీయ సందడి మరోవైపు ... తస్మాత్ జాగ్రత్త
స్వైన్ ఫ్లూ .. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న అత్యంత ప్రమాదకరమైన వ్యాధి . శీతాకాలంలో విజృంభించే స్వైన్ ఫ్లూ వ్యాధి, ఎండలు మండుతున్నా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఒక పక్క తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి నెలకొంటే మరో పక్క అదే స్థాయిలో స్వైన్ ఫ్లూ అలజడి నెలకొంది. అందుకే వైద్యులు అంటున్నారు తస్మాత్ జాగ్రత్త .
కరీంనగర్ ప్రచార సభలో కేసీఆర్ సంచలనం .. అవసరమైతే కొత్త జాతీయపార్టీ పెడతా
ఎన్నికల సమయంలో స్వైన్ ఫ్లూ అలజడి
రాష్ట్రంలో భానుడి ప్రతాపంలో ప్రజలు అల్లాడుతున్నా స్వైన్ ఫ్లూ వ్యాధి తీవ్రత తగ్గలేదు. చలికాలంలో విజృంభించే వైరస్ ఎండలను తట్టుకుని ఉంటోందని వైద్యులు చెపుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో గడిచిన 45 రోజుల్లో 573 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ కేంద్రానికి పంపిన నివేదికలో తెలిపింది. కాగా వీరిలో 12 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇటీవల 2 రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ వ్యాధితో ఇద్దరు మరణించారు. ఇపుడే పార్లమెంట్ ఎన్నికలు రావటం .. కొత్తగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావటంతో రాజకీయ సమావేశాలు..ర్యాలీలు.. బహిరంగ సభలలో స్వైన్ ఫ్లూ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటుంటారు. ఇటువంటి సందర్భాలలో ప్రజలు మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
గతంతో పోలిస్తే విపరీతంగా పెరిగిన స్వైన్ ఫ్లూ కేసులు
గతేడాది దేశవ్యాప్తంగా 14వేల 992 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా 1 , 103 మంది మరణించారు. కాగా.....ఈ ఏడాది రెండున్నర నెలల కాలంలో 20 వేల స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా వీరిలో 605 మంది చనిపోయారు. గతేడాది కాలంగా 14వేల పైగా కేసులు నమోదు కాగా, కేవలం ఈఏడాది రెండున్నర నెలల కాలంలో నమోదైన కేసుల సంఖ్య చూస్తుంటే వ్యాధి తీవ్రత ఏ స్ధాయిలో ఉందో అర్ధం అవుతుంది. వ్యాధి తీవ్రత ఆందోళన కలిగిస్తుంది.
ఎన్నికల్లో ప్రచారానికి గుంపులుగా తిరిగితే అంతే సంగతి అంటున్న వైద్యులు
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ప్రజలు సమూహాంలుగా ప్రచారంలో పాల్గొంటుంటారు. భారీ బహిరంగ సభలు జరుగుతుంటాయి. జనాలు గుంపులు గుంపులుగా ఉన్న సమయంలోనే స్వైన్ ఫ్లూ విజృంభించే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండా కాలంలో ఏమీ కాదన్న ధీమాతో ఉంటే పరిస్ధితి అదుపుతప్పే ప్రమాదం ఉంది. గుంపులు,గుంపులుగా ప్రజలు సంచరించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా లేకుంటే వ్యాధి మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. కనుక అప్రమత్తంగా ఉండటం అవసరం .