తమ్ముళ్లను వైసీపిలోకి రమ్మని తలసాని స్పెషల్ రెక్వస్ట్ ..! డైలమాలో ఏపి టీడిపి నేతలు..!!
హైదరాబాద్ : ఇటీవల తెలంగాణ మంత్రి వర్గంలో చోటు సంపాదించుకుని ఆ రాష్ట్రంలో వరుసగా రెండోసారి మంత్రి బాధ్యతలు స్వీకరించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్లో తరుచుగా పర్యటనలు చేస్తున్నారు తలసాని. తెలుగుదేశం పార్టీని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టు ఆయన చెప్పరనే చెప్పుకొస్తున్నారు. టీడీపీకి ప్రధాన బలంగా ఉన్న బీసీలను ఆ పార్టీ నుంచి దూరం చేయాలని తలసాని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం యాదవ గర్జన పేరుతో ఏపిలో పలు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు తలసాని. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ను వైసీపీలో చేరాలని తలసారి ఒత్తిడి తేవడం కొస మెరుపు..!
ఇక పుట్టా సుధాకర్ కూడా యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే కావడమే కాకుండా, తలసానికి వియ్యంకుడు వరస అవుతాడు కాబట్టి తలసాని ఈ విధంగా బలవంతం చేస్తున్నారని తెలుస్తోంది. ఐతే తలసాని ప్రతిపాదనకు సుధాకర్ యాదవ్ ఎలాంటి నిర్ణయం చెప్పలేదని తెలుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో మైదుకూరు నుంచి ఓడిపోయిన ఆయనను చంద్రబాబు టీటీడీ చైర్మన్ చేశారు. అంతేకాదు, కొద్దిరోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పుట్టాకు సీటు ఖరారు చేశారు. ఇటీవల జరిగిన సమీక్షలో ఈ మేరకు సంకేతాలు కూడా పంపారని సమాచారం. పుట్టా సుధాకర్ కాకుండా మరికొంత మంది ఏపి టీడిపి నేతలతో తలసాని సంప్రదింపులు జరుపుతూ పార్టీ మారే అంశాన్ని ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది. ఐతే పుట్టా సుధాకర్ కు సంబంధం లేని పార్టీ లో చేరమని ఒత్తిడి తెస్తున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గురించి ఏపిలో పెద్ద యెత్తున చర్చ జరుగుతున్నట్టు సమాచారం.