టిడిపిలోకి పనబాక..హర్షకుమార్: రేపు తొలి జాబితా..మేనిఫెస్టో విడుదల: 16 నుండి బాబు ప్రచారం..!
Recommended Video
టిడిపిలో అభ్యర్ధుల ఎంపిక చివరి దశకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు టిడిపి బాట పట్టారు. కాంగ్రెస్ లో కీలక నేతలుగా వ్యవహరించిన పనబాక దంపతులు..హర్ష కుమార్ ఈ రోజు టిడిపిలో చేరుతున్నారు. వారికి ఎంపీ సీట్లు కేటా యించే అవకాశం ఉంది. ఇక, రేపు టిడిపి మేనిఫెస్టో విడుదల చేసి..ఈ నెల 16వ తేదీ నుండి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.
ఫ్యాన్ల సంగతి సరే! సైకిల్, హస్తం గుర్తులను ఎట్లా తీయించగలరు?
టిడిపిలోకి కాంగ్రెస్ నేతలు
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితా ను టిడిపి అధినేత ఒకటి రెండో రోజుల్లో విడుదల చేయనున్నారు. ఎంపీల విషయంలో టిడిపి ఆచితూచి అడుగులు వేస్తోంది. అందులో భాగంగా.. కాంగ్రెస్ నుండి సీనియర్ నేతలు టిడిపిలో చేరుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన పనబాక దంపతులు టిడిపిలో చేరుతున్నారు. పనబాక లక్ష్మీ బాపట్ల లేదా తిరుపతి నుండి టిడిపి ఎంపి అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు. అదే విధంగా అమలాపురం మాజీ ఎంపి హర్షకుమార్ సైతం టిడిపి లో చేరటం ఖాయమైంది. ఆయనకు అమలాపురం ఎంపీ సీటు ఇస్తారని సమాచారం. సిట్టింగ్ ఎంపి రవీంద్రబాబు పార్టీ వీడటంతో అక్కడ దివంగత స్పీకర్ బాలయోగి కుమారుడిని బరిలోకి దించాలని భావించారు. అయితే, ఇప్పుడు హర్ష కుమార్ టిడిపిలోకి వస్తుండటంతో..ఆయనకు అమలాపురం సీటు కేటాయించే ఛాన్స్ ఉంది.
రేపు టిడిపి మేనిఫెస్టో విడుదల
తాజా ఎన్నికల కు సంబంధించి టిడిపి మేనిఫెస్టో గురువారం విడుదల చేయనున్నారు. ఇప్పటికే మేనిఫెస్టో కు సంబంధించి మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షత కమిటీ ఏర్పాటు చేసారు. ఆ కమిటీ ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలతో మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్లు సమాచారం. రేపు మేనిఫెస్టో విడుదల చేసిన తరువాత ముఖ్యమంత్రి టిడిపి తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక, ముఖ్యమంత్రి రేపు ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ బిజెపీతర పార్టీల సమావేశం లో పాల్గొంటారు. వీవీ ప్యాట్ స్లిప్లు లెక్కించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే... ఆ పిటిషన్ పై 15వతేదీన విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా విపక్ష నేతలు రాహుల్గాంధీ, చంద్రబాబునాయుడు, మమతాబెనర్జీ, కేజ్రీవాల్ తదితరులు కోర్టుకు హాజరుకానున్నారు
తొలి జాబితా..ఇక ప్రచారం
టిడిపి గురువారంఅభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 16న ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నారు. ఆరోజు తొలుత తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం చిత్తూరు జిల్లా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం శ్రీకాకుళానికి చేరుకుని ఆ జిల్లా పార్టీ శ్రేణులతో భేటీ అవుతారు. ఇలా 16 నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తారు. జిల్లాస్థాయి నాయకత్వం మొదలుకుని సేవామిత్రలు, బూత్స్థాయి కన్వీనర్ల వరకూ పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి, దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పర్యటనలు ముగిశాక ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతారు. ఆయా జిల్లాల్లో బహిరంగ సభలు, రోడ్షోలు నిర్వహించనున్నారు.