టిడిపిలో ఆ నలుగురికే ఎమ్మెల్సీ సీట్లు : వైసిపి లో ఎవరికి దక్కేను..!
ఏపి శాసనమండలిలో 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో..టిడిపి - వైసిపి పార్టీల్లో ఆశావాహుల్లో సందడి మొదలైంది. ఫిబ్రవరి 10న వీటికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. వీటిలో ఎమ్మెల్యే కోటాలో అధికార టిడిపికి నాలుగు సీట్లు..ప్రతిపక్ష వైసిపి ఒక సీటు దక్కనుంది. ఇక, మిగిలిన నాలుగు ఉపాధ్యాయ - పట్ట భద్రుల నియోజకవర్గాల నుండి ఎన్నిక కానున్నారు.
టిడిపి తో పొత్తు వద్దు : విజయమ్మ కాళ్లు అయినా పట్టుకుంటాం: ఏపి కాంగ్రెస్ నేతల సంచలనం..!
ఎమ్మెల్యే కోటాలో 5 స్థానాలు..
రాష్ట్ర శాసనమండలిలో ఖాళీ అవుతున్న 9 స్థానాల్లో 5 ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అవుతున్నాయి. శాసనసభ్యుల కోటాలోని 5 స్థానాల్లో పదవీ విరమణ చేస్తున్న వారిలో మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, పి.శమంతకమణి, అంగూరి లక్ష్మీ శివకుమారి ఉన్నారు. ఆ అయిదు స్థానాల్లో తెలుగు దేశంకు నాలుగు, వైసిపి కి ఒక్క స్థానం దక్కనుంది. టిడిపికి దక్కే నాలుగు స్థానాల్లో ఒకటి మళ్లీ యనమల రామకృష్ణుడికే కేటాయించడం దాదాపు ఖాయం.
టిడిపి లో కొత్త చర్చ
మంత్రి నారాయణ ఈసారి నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. వంగవీటి రాధాకృష్ణ తెదేపాలో చేరటం ఖాయమైంది. ఆయనకు విజయవాడ సెంట్రల్ టిక్కెట్ ఇవ్వలేనని స్పష్టంగా చెప్పటం తో ఆయనను ఎమ్మెల్సీగా పంపించే అవకాశం ఉంది. ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్బాబు కు ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాల్సి ఉంది. ఇక, ఇప్పటి వరకు వైసిపి లో ఉన్న ఘట్టమనేని ఆదిశేషగిరి రావు కు సైతం టిడిపిలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో..యనమల మినహా..మిగిలిన మూడు సీట్లు కొత్త వారికే ఇవ్వటం తో టిడిపి లో కొత్త చర్చ మొదలైంది.
వైసిపి లో ఎవరికి దక్కేను..
ఇక, ఎమ్మెల్యే కోటాలో వైసిపి కి సంఖ్యా బలం ఆధారంగా ఒక్క సీటు దక్కనుంది. జగన్ పాదయాత్రలో భాగంగా ఇప్పటి వరకు శాసనసభలో అసలు ప్రాతినిధ్యం దక్కని వర్గాలకు వచ్చే సారి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని ప్రకటించారు. అందు లో బిసి వర్గాలు ఉన్నాయి. ఇదే సమయంలో అనేక చోట్ల సామాజిక సమీకరణాల్లో భాగంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ల ను మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అందులో తొలి నుండి పార్టీని నమ్ముకొని అంకిత భావంతో పని చేసిన వారికి సైతం ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో..వైసిపి నుండి ఈ సారి రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ బిసి నేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వచ్చే నెల 10వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉండటం..వచ్చే ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొని టిడిపి కొత్త వారికి అవకాశం ఇస్తుండటంతో..జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి కరం గా మారింది.