దాని కోసం కాళ్లావేళ్లా పడ్డ జగన్: కేడీల రాజ్యం: రైతులకు బేడీలు: భూములు లాక్కోవద్దన్నందుకు
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ను కేడీతో పోల్చారు. ఇది కేడీల రాజ్యం అంటూ మండిపడ్డారు. అమరావతి రైతులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి చేతులకు సంకెళ్లను వేసి న్యాయస్థానానికి తరలిస్తోన్న రెండు ఫొటోలను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అన్నదాతలను ప్రభుత్వం క్షోభకు గురి చేస్తోందంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఏ ఒక్క రైతు కుటుంబం సంతోషంగా లేదని చెప్పారు.
రైతులకు బేడీలు వేసిన రాష్ట్రంగా..
రైతులకు బేడీలు వేసిన రాష్ట్రంగా అప్రదిష్టను వైఎస్ జగన్ మూటగట్టుకున్నారని ఆరోపించారు. కేడీల రాజ్యంలో రైతులకు బేడీలా అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేశారిన అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల కాలంలో కన్నీళ్లు పెట్టని రైతు కుటుంబాలు లేవని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత కుటుంబాలను ఎందుకింత క్షోభకు గురి చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
మద్దతు ధర అడిగితే అరెస్టులా?
మద్దతు ధర అడిగిన అన్నదాతలపై ప్రభుత్వం అక్రమంగా కేసులను బనాయిస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. తమ భూములు లాక్కోవద్దని వేడుకున్న రైతులపై తప్పుడు కేసులతో జైలుపాలు చేస్తున్నారని చెప్పారు. స్వచ్ఛందంగా రాజధానికి భూములిచ్చిన రైతులపైనా అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నిజాయితీగా వ్యవహరించిన రైతులను కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.
దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులా?
ఏడాదిన్నరలో వేలాది రైతులపై అక్రమ కేసులు నమోదు చేశారని, ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పారు. దళిత రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టడం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. పురుగు మందు డబ్బాలతో దళిత మహిళలు తమ భూముల్లో పహారా కాసిన సంఘటనలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేవని అన్నారు. అక్రమ కేసులను బనాయించి, రైతులను జైలుపాలు చేయడానికే వైఎస్ జగన్ తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ కాళ్లావేళ్లా పడ్డారని విమర్శించారు.
ఒక్క ఛాన్స్ ఇందుకేనా?
అసైన్డ్ భూములను లాక్కుని దళిత రైతుల పొట్ట కొట్టారని, ఒక్క ఛాన్స్ ఇచ్చిన నేరానికి వైఎస్ జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల ఉసురు పోసుకుంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఫిర్యాదుదారు కేసును ఉపసంహరించుకున్న తరువాత కూడా రాజధాని రైతుల చేతులకు బేడీలు వేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఇది విరుద్ధమని చెప్పారు.
ఇలాంటి దుర్మార్గాలను అడ్డుకోండి..
గతంలో రైతుల కాళ్లకు బేడీలు వేసిన పార్టీకి పట్టిన గతే వైఎస్ఆర్సీపీకి పడుతుందని చంద్రబాబు అన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసి, వారిని తీవ్రమైన నేరాలకు పాల్పడినవారిని అరెస్టు చేసినట్లు న్యాయస్థానానికి తరలించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వారిని సస్పెండ్ చేయాలని చెప్పారు. ఇలాంటి దుర్మార్గపు ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నదాతల కంట నీరు చిందించడం ఏ రాష్ట్రానికి, ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు.