చేతులు జోడించి వేడుకున్న కనికరించలేదు, అమరావతిపై సర్కార్ కఠిన నిర్ణయం, టీడీపీ దివ్యవాణి
అమరావతి రాజధాని మార్పుపై సీఎం జగన్ ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్లారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆరోపించారు. నిండు సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేతులు జోడించి అడిగిన కనికరించలేదన్నారు. రాజధాని మార్పుపై ముందుకు సాగారని.. ప్రతిపక్షం, సభ్యుల మాటకు విలువ ఇవ్వలేదని మండిపడ్డారు. మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయం మూమ్మాటికీ తప్పు అని చెప్పారు.
అమరావతి బంగారు బాతు అని దివ్యవాణి పేర్కొన్నారు. అమరావతి నుంచి సంపద సృష్టించేందుకు చంద్రబాబు ప్రణాళికలు రచించారని గుర్తుచేశారు. దాదాపు 4 లక్షల కోట్ల సంపదను సీఎం జగన్ ధ్వంసం చేశారని మండిపడ్డారు. దీంతో ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. అభివృద్దిలో కూడా వెనక్కి వెళతామని చెప్పారు. రాజధాని తరలింపును ఎవరూ వద్దని చెప్పినా.. సీఎం జగన్ మాత్రం పెడచెవిన పెట్టారని ధ్వజమెత్తారు.
జగన్ ప్రభుత్వానికి పదే పదే కోర్టు మొట్టికాయలు వేస్తుందని గుర్తుచేశారు. గ్రామ సచివాలయాలకు రంగుల నుంచి రాజధాని వరకు అన్ని నిర్ణయాలను తప్పుపట్టాయని తెలిపారు. కానీ ప్రభుత్వం మాత్రం లెక్క చేయడం లేదన్నారు. అమరావతి రైతుల మొరను న్యాయస్థానాలు ఆలకించాయని తెలిపారు. వారికి హైకోర్టులో ఊరట కలిగిందని చెప్పారు. స్వర్ణప్యాలెస్ ఘటనలో వాస్తవాలు బహిర్గతం చేయడం లేదని చెప్పారు. కానీ రమేశ్ బాబుపై మాత్రం కక్షసాధింపు చర్యలు చేపట్టారని తెలిపారు.