బీసీలపై ఎందుకు ఈ కక్షసాధింపు, అక్రమ కేసులు అందుకే.. అచ్చెన్నాయుడు ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. బీసీలపై కక్షసాధింపు చర్యలు ఆపడం లేదన్నారు. ఇవాళ అసెంబ్లీకి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని గెలిపించిన వర్గాలపై ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై జరిగిన దాడులకు నిరసనగా ఇవాళ వాయిదా తీర్మానం ఇచ్చామని వివరించారు.
తాను, కొల్లు రవీంద్ర బీసీలుగా పుట్టడం తప్పా అని అచ్చెన్నాయుడు అడిగారు. అందుకే తమ మీద ప్రభుత్వం కేసులు పెట్టిందా అని అడిగారు. అసెంబ్లీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని దాచడానికే మీరు కొన్ని మీడియా సంస్థలను నిలిపివేస్తారా అని అడిగారు. సీఎం మటాడితేనే లైవ్ వస్తోంది.. మరీ ప్రతిపక్ష నేత, సభ్యులు మటాడినప్పుడు లైవ్ కనపడనివ్వడం లేదన్నారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై జరిగే చర్చలు తెలియకుండా కొన్ని మీడియాలను నియంత్రిస్తున్నారని ఆరోపించారు. అన్నీ మీడియా సంస్థలకు సమాన అవకాశాలు కల్పించాలని అచ్చెన్నాయుడు కోరారు. సలాం కుటుంబం ఆత్మహత్య, డాక్టర్ సుధాకర్ సహా దళితులపై దాడులపై వాయిదా తీర్మానాన్ని అనుమతించి చర్చించాలని కోరారు.
Recommended Video
వైద్యులు కోవిడ్ సేవ చేస్తే ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దీంతో డాక్టర్, నర్సులు, వైద్య సిబ్బంది ఔట్ సోర్సింగ్లో పనిచేశారు. కానీ ఇప్పుడు వీరి సేవలు చాలు అని చెబుతూ ఉత్తర్వులు ఇచ్చారు. వీరి సేవలను ఔట్ సోర్సింగ్లో కొనసాగించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. లేదంటే వారి కోసం పోరాడుతామని చెప్పారు.