తాడిపత్రిలో దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. పోలీసులపై టీడీపీ నేత దీపక్ రెడ్డి ధ్వజం
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇన్సిడెంట్లో పోలీసులే కీలకంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎమ్మెల్యే, అతని కుమారుడు, అనుచరులు కత్తులు, కర్రలు, గొడ్డళ్లతో జే సీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి వచ్చి దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని మండిపడ్డారు. గుంపులుగా వచ్చిన వైసీపీ శ్రేణులు.. జే.సీ.ప్రభాకర్ రెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వుతుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు.
Recommended Video
144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు చెప్పారని గుర్తుచేశారు. మరీ దాడిని ఎందుకు నిలువరించలేదని అడిగారు. అక్కడికి వచ్చిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే భార్య ఇసుకపై మామూళ్లు వసూలు చేస్తోందని వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సింది అని చెప్పారు. నిజానిజాలు తెలుసుకోవాల్సిన ఎమ్మెల్యే.. విచక్షణ కోల్పోయి దాడికి పాల్పడితే పోలీసులు ఆయన్ని, అతని అనుచరులను వదిలేశారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులపై ఎస్సీ, ఎస్టీ కేసు, హత్యాయత్నం కేసులు పెట్టడం సరికాదన్నారు.
దాడికి సంబంధించిన వీడియోల్లో ఎమ్మెల్యే, అతని అనుచరుల వీరంగం స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. వారికి పోలీసులు సహకరించారని అర్థమవుతుందన్నారు. హోం మంత్రి మాత్రం శాంతి చర్చలకు వెళ్లారని చెప్పడం ఏంటి అని నిలదీశారు. ఆయుధాలతో ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి వెళ్లడం శాంతి చర్చలు ఎలా అవుతాయో హోం మంత్రి, జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి ఘటనను, అక్కడి పోలీసుల తీరుని సమర్థించినందుకు హోం మంత్రి తక్షణమే తన పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తాడిపత్రి ఘటన పోలీసుల ప్రమేయంతో జరిగిందని ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని దీపక్ రెడ్డి తెలిపారు. దాడిని ప్రోత్సహించి, వైసీపీ వారికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.