బీజేపీకి ఏపీ మంత్రి విరాళం... టీడీపీలో కలకలం
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శతృవులు ఉండరంటారు. ఉండేది ఒక పార్టీ అయినప్పటికీ మరో పార్టీతో ఏ సమయంలో ఏ అవసరం వచ్చి పడుతుందో అని నేతలు ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తూ ఉంటారు. బయటకు కొట్టుకున్నట్లే కనిపించినా వారి పనులు మాత్రం లోపల చక్కబెట్టుకుంటూ ఉంటారు. రాజకీయాల్లో ఇది సర్వసాధారణం. తాజాగా టీడీపీ బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ స్వయంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఏపీ మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థలు మాత్రం బీజేపీకి విరాళం ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఓ వైపు బీజేపీతో చాలా దూరంగా ఉన్నామన్న భావన కలగజేస్తూ మరోవైపు ఇలా విరాళం ఇవ్వడమేంటి అంటూ తెలుగు తమ్ముళ్ల మధ్యే చర్చ జరుగుతోంది.
బీజేపీకి పార్టీ ఫండ్ ఇచ్చిన మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థలు
రాజకీయాల్లో పార్టీ ఏదైనా నేతల మధ్య మాత్రం బయటకు కనిపిస్తున్నంతగా విబేధాలు ఉండవు. టీడీపీ బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాక రెండు పార్టీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. కానీ వ్యక్తిగతంగా నేతలు మాత్రం భాయీ భాయీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు నిదర్శనం తాజాగా ఏపీ మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థలు బీజేపీకి విరాళం ఇవ్వడమే. రూ.5 లక్షలు బీజేపీకి విరాళంగా ఇచ్చింది నారాయణ విద్యాసంస్థలు. ఇది ఎప్పుడో అనుకుంటే పొరపాటే.. టీడీపీ బీజేపీతో సంబంధాలు తెంచుకున్న తర్వాత ఇచ్చిన విరాళం.ఎన్నికల కమిషన్కు జాతీయ పార్టీలు తమకు అందిన విరాళాలపై ఓ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో నారాయణ విద్యాసంస్థలు బీజేపీకి విరాళంగా రూ.5లక్షలు ఇచ్చినట్లుగా పొందుపర్చారు. ఇప్పుడు దీనిపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. కేంద్ర సంస్థలు ఐటీ దాడులు నిర్వహిస్తుండగా ఆ జాబితాలో మంత్రి నారాయణ పేరు కూడా ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ విరాళం ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత పెరిగింది. ఓ వైపు బీజేపీకి దూరంగా ఉంటూనే విరాళం ఇవ్వడమేంటి అంటూ టీడీపీలో చర్చ జరుగుతోంది.
బీజేపీకి 2017-18లో వచ్చిన విరాళాలు రూ.437 కోట్లు
ఇదిలా ఉంటే బీజేపీ ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో పార్టీకి విరాళాల రూపంలో వచ్చిన మొత్తం రూ.437.04 కోట్లుగా పేర్కొంది. దేశంలోని ఇతర పార్టీలకంటే బీజేపీకే అత్యధిక విరాళాలు వచ్చాయి. ఇక కాంగ్రెస్కు రూ.26.65 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. మొత్తంగా చూస్తే కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం తృణమూల్ కాంగ్రెస్లకు వచ్చిన విరాళాలతో పోలిస్తే బీజేపీకి 12 రెట్లు ఎక్కువగా విరాళాలు వచ్చాయి. ఇదంతా ఒక్క 2017-18 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే. 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి జాతీయ పార్టీలకు విరాళాలు 119.49 కోట్లు తక్కువగా వచ్చాయి. అంటే 20శాతం విరాళాలు తగ్గిపోయాయి.
బీజేపీకి హైదరాబాదు నుంచి 25 మంది విరాళాలు ఇచ్చారు
జాతీయ పార్టీలకు విరాళాలు ఎక్కువగా ఇచ్చింది కార్పోరేట్ కంపెనీలు, వ్యాపార రంగాలకు చెందిన వారు కావడం విశేషం. హైదరాబాదు తీసుకుంటే 28 మంది దాతలు జాతీయ పార్టీకి విరాళాలు ఇచ్చారు. ఇందులో 25 మంది బీజేపీకి విరాళాలు ఇవ్వగా ముగ్గరు మాత్రం కాంగ్రెస్కు పార్టీ ఫండ్ కింద డొనేషన్స్ ఇచ్చారు. హైదరాబాదులో బీజేపీకి విరాళం ఇచ్చిన వారిలో పీనా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, నిహారికా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, రిధి ఇంజనీర్స్, జీవీపీఆర్ ఇంజినీర్స్, బీఆర్సీ ఇన్ఫ్రా, ఆర్క్ బిల్డర్స్, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్, శ్రీ కళ్యాణ్ చక్రవర్తి మొమోరియల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినప్పటికీ కొందరు వ్యక్తులు బీజేపీకి విరాళం ఇచ్చారు.
ఇక కాంగ్రెస్కు హైదరాబాదు నుంచి ఇద్దరు మాత్రమే విరాళాలు ఇచ్చారు. ఒకరు కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ మరొకటి జీఎంసీ ప్రాజెక్ట్స్ సంస్థ. ఇక దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీకి ప్రుడెంట్ ఎలక్టరోల్ ట్రస్టు రూ.154.30 కోట్లు విరాళంగా ఇచ్చింది. అంటే బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాల్లో 35 శాతం ఈ సంస్థ నుంచి వచ్చినవే కావడం విశేషం.