టీడీపీలో మరో వికెట్: అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గుడ్ బై? త్వరలో వైఎస్ఆర్ సీపీలోకి?
అమరావతి: ఎన్నికల ముంగిట్లో అధికార తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. లోక్ సభ సభ్యుడు అవంతి శ్రీనివాస్ ఆలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సమాచారం. రాజీనామా పత్రాన్ని ఆయన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సారి అనకాపల్లి లోక్ సభ టికెట్ తనకు దక్కదనే ఉద్దేశంతోనే అవంతి శ్రీనివాస్ పార్టీని వీడినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ కు బదులుగా, అనకాపల్లి లోక్ సభ స్థానాన్ని కొణతల రామకృష్ణ లేదా దాడి వీరభద్రరావు కుటుంబ సభ్యులకు కేటాయించ వచ్చంటూ లీకులు వచ్చాయి. దీనిపై అవంతి శ్రీనివాస్ పార్టీ నేతల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా.. పెద్దగా స్పందించలేదని, దీనితో ఆయన పార్టీని వీడారని అంటున్నారు.
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్ని గంటల్లోనే అవంతి శ్రీనివాస్ కూడా అదే బాటలో నడిచినట్లు వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల్లో అవంతి కూడా వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలను ఎదుర్కోవాల్సిన స్థితిలో ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతుండటం తెలుగుదేశం నేతల్లో కలవరానికి గురి చేస్తోంది.
2014 ఎన్నికల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అప్పట్లో భారీ ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించింది. అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే వైఎస్ఆర్ సీపీకి చెందిన నంద్యాల, కర్నూలు లోక్ సభ్య సభ్యులు ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుకలను తమ పార్టీలోకి చేర్చుకుంది టీడీపీ. ఆ తరువాత వరుసగా 23 మంది ఎమ్మెల్యేలకు పార్టీ కండువా కప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రి పదవిని కూడా ఇచ్చారు.
ఈ సారి వంతు వైఎస్ఆర్ సీపికి వచ్చినట్టుంది. 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలోకి వలసల పర్వం ముమ్మరమైంది. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సొంత బావ రామకోట సుబ్బారెడ్డి ఇటీవలే వైఎస్ఆర్ సీపీలో చేరారు. చంద్రబాబు తోడల్లుడు, ప్రకాశం జిల్లాకు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడు హితేష్ తో సహా జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇదివరకే టీడీపీకి గుడ్ బై చెప్పి, వైఎస్ఆర్ సీపీలో చేరారు.
2009లో తొలిసారిగా ప్రజారాజ్యం పార్టీలో చేరి, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అవంతి శ్రీనివాస్. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన విశాఖపట్నం జిల్లా భీమిలీ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన తరువాత.. బయటికి వచ్చారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనను అనకాపల్లి లోక్ సభ స్థానాన్ని కేటాయించింది టీడీపీ. అప్పటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్ నాథ్ పై 47, 932 ఓట్ల తేడాతో గెలుపొందారు. విశాఖపట్నం జిల్లాకే చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు అవంతి శ్రీనివాస్ అప్తమిత్రుడు.
ఈ సారి తనకు టికెట్ లభించే అవకాశాలు లేకపోవడం వల్లే పార్టీ ఫిరాయించినట్లు చెబుతున్నారు. అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ సీపీలో చేరితే, అనకాపల్లి లోక్ సభ టికెట్ ఇస్తారా? లేదా? అనేది ఆసక్తికరం. ఎందుకంటే- ఈ స్థానంలో గుడివాడ అమర్ నాథ్ క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఇక్కడ సీట్లను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. గుడివాడ అమర్ నాథ్ లేదా అవంతి శ్రీనివాస్ లల్లో ఎవరో ఒకరికి అసెంబ్లీ సీటును కేటాయించే అవకాశాలు లేకపోలేదు.