శ్రీశైలం అభ్యర్థి కోసం టీడీపీ తంటాలు: పరిశీలనలో ఇద్దరు: నన్ను వదిలేయండంటున్న సీనియర్!
కర్నూలు: కర్నూలు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన షాక్ నుంచి తెలుగుదేశం పార్టీ తేరుకోలేక పోతోంది. నామినేషన్ల పర్వం ఆరంభమైన సమయంలో, అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తరువాత కూడా బుడ్డా జారుకోవడాన్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. బుడ్డా స్థానంలో మరో అభ్యర్థిని వెదకే ప్రయత్నాల్లో ఉన్నారు. శ్రీశైలం టికెట్ కోసం కొత్త నాయకుడిని అన్వేషించుకునే దుస్థితిలో పడిపోయింది అధికార పార్టీ.
తన వల్ల కాదంటోన్న ఏరాసు
శ్రీశైలం స్థానం నుంచి పోటీ చేయడానికి ఇద్దరు నాయకుల పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. ఆళ్లగడ్డకు చెందిన ఏవీ సుబ్బారెడ్డి సహా శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిలల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. వారిలో ఏరాసు ప్రతాప్ రెడ్డి పోటీ చేయడానికి ఆసక్తి చూపట్లేదు. మరోసారి ఓడిపోవడానికి తాను సిద్ధంగా లేనని ఏరాసు పార్టీ నాయకుల ముఖం ముందే చెప్పేశారట. కోట్ల రూపాయలను ఖర్చు పెట్టుకుని, ఓటమిని కొని తెచ్చుకోలేనని ఆయన స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. పోటీ చేయడం తన వల్ల కాదని, తనను వదిలేయాలని ఏరాసు పార్టీ అగ్ర నాయకత్వానికి సూచించినట్లు తెలుస్తోంది.
షరతులు పెడుతున్న ఏవీ సుబ్బారెడ్డి
కాగా, ఆళ్లగడ్డకు చెందిన సీనియర్ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి పేరును పరిశీలనలోకి తీసుకుంది టీడీపీ. ఆయన కూడా పెద్దగా ఆసక్తిగా లేరని అంటున్నారు. నియోజకవర్గం పరిస్థితులను తెలుసుకోవడానికి ఏవీ సుబ్బారెడ్డి ఇదివరకే బుడ్డాతో ఫోనులో మాట్లాడారని, ఆయన నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారని అంటున్నారు. తప్పనిసరిగా పోటీ చేయాల్సి వస్తే.. ఒక్క రూపాయి కూడా తాను ఖర్చు చేయలేనని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. ఎన్నికల వ్యయాన్ని మొత్తం పార్టీ భర్తిస్తేనే తాను పోటీ చేస్తానని షరతులు విధించినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. దీనిపై టీడీపీ అగ్ర నాయకత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదని తెలుస్తోంది.
తన సోదరుడికి ఇవ్వండంటున్న బుడ్డా రాజా
అదే సమయంలో- బుడ్డా రాజశేఖర్ రెడ్డి సోదరుడు బుడ్డా శేషారెడ్డి పేరును కూడా టీడీపీ పరిశీలనలోకి తీసుకుందని అంటున్నారు. బుడ్డా శేషారెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయనతో పార్టీ ఫిరాయింపజేసి, శ్రీశైలం టికెట్ ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు ప్రత్యామ్నాయంగా తన సోదరుడికి టికెట్ ఇవ్వాలంటూ రాజశేఖర్ రెడ్డి కూడా పార్టీ అదిష్ఠానికి సూచించినట్లు చెబుతున్నారు. ఎన్నికల ఖర్చు వద్ద మాత్రం బుడ్డా సోదరుడు కూడా షరతులు పెడుతున్నట్లు సమాచారం.