నల్ల జెండాలు..గోబ్యాక్ నినాదాలు: చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా: కార్యకర్తల బాహాబాహీ..!
ప్రతిపక్ష నేత హోదాలో తొలసారి చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. ఉద్రిక్తతల నడుమ ఆయన పర్యటన సాగుతోంది. రాజధానిలో పర్యటన పైన చంద్రబాబు ప్రకటన చేసిన సమయం నుండి రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. రాజధాని రైతుల్లోనూ చీలక కనిపించింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా కొందరు దళిత రైతులు బయటకు వచ్చారు. ముందుగా దళిత రైతులకు క్షమాపణ చెప్పి రాజధానిలో పర్యటనకు రావాలని వారు డిమాండ్ చేసారు. అయితే, వైసీపీ రాజధానిలో తమ ప్రభుత్వం ఏం చేయలేదని విమర్శిస్తోందని..తాము ఏం చేసామో వివరించటానికి పర్యటన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇక, చంద్రబాబు పర్యటన ప్రారంభమైన సమయం నుండి రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొని ఉంది.
అమరావతిలో టెన్షన్: చంద్రబాబు కాన్వాయ్ పైకి చెప్పులు: టీడీపీ..వైసీపీ వర్గాల ఘర్షణ..!
వెంకటపాలెంలో టీడీపీకి అనుమతి లేదన్న పోలీసులు
చంద్రబాబు తన నివాసం నుండి రాజధాని పర్యటనకు బయల్దేరిన వెంటనే ఆయనకు మద్దతుగా పార్టీ నేతలు..కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అప్పటికే చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ అనేక మంది స్థానికులు నినాదాలు చేస్తూ కనిపించారు. వారు చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకొనేందుకు చెప్పులు..రాళ్లు..విసిరే ప్రయత్నం చేసారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వెంకటాయ పాలెం వద్ద పెద్ద ఎత్తున నల్ల జెండాలతో చంద్రబాబు పర్యటనకు గ్రామంలో అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేసారు. ఆ సమయంలో పోలీసులు..టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.అక్కడే పర్యటన వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తున్న వారు చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకొనే ప్రయత్నం చేసారు.
నల్లజెండాలు..నినాదాలు..అడ్డుకొనే ప్రయత్నం
ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు రాజధాని పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఉన్నారు. వెంకటాయపాలెం,ఉద్దండరాయ పాలెం, నేలపాడు, రాయపూడి, ఐనవోలు తదితర గ్రామాల మీదుగా చంద్రబాబు పర్యటన సాగుతోంది. రాజధాని పర్యటనలో అడుగడుగునా చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు రాజధాని పర్యటనకు రావొద్దంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కరకట్ట నుంచి రాయపుడి వరకు ఈ నిరసన ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. రాజధానిలో చంద్రబాబు పర్యటన చేస్తే వైసీపీకి ఎందుకు భయం అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
రెండు వర్గాల బాహా బాహీ..
చంద్రబాబు పర్యటన సమయంలో అనుకూల..వ్యతిరేక వర్గాలతో ఆయన పర్యటిస్తున్న ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పర్యటన అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే, యాక్సెస్ రోడ్డ వద్ద చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన వారికి వ్యతిరేకంగా చంద్రబాబు కు అనుకూలంగా టీటీడీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో..రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పర్యటనలో పలు సందర్భాల్లో టీడీపీ..వైసీపీ వర్గాల మధ్య బాహాబాహీకి దిగారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను సీఎం జగన్ దెబ్బ తీసి ఏపీ ప్రతిష్ఠను పూర్తిగా దెబ్బ తీసారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం వరకు చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.