AP Decentralisation: ఏపీ భవన్లో ఐ లవ్ అమరావతి అక్షరాలు తొలగింపు..!
న్యూఢిల్లీ: రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారం, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చడానికి అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఏపీ వికేంద్రీకరణ బిల్లు ప్రభావం.. దేశ రాజధానిలోని ఏపీ భవన్పై పడినట్లు కనిపిస్తోంది. ఐ లవ్ అమరావతి అంటూ ఏపీ భవన్ ప్రధాన ద్వారం వద్ద అమర్చిన అక్షరాలను తొలగించారు అధికారులు. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల ఆదేశాల మేరకే వాటిని తొలగించినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
పాత్రధారులు దొరికారు..సూత్రధారులను తేల్చాలి: రాజధాని ల్యాండ్ స్కామ్లో స్పీడుగా సీఐడీ
ఇదివరకు రాష్ట్రంలో అధికారంలో కొనసాగిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన తరువాత ఈ అక్షరాలను ఏపీ భవన్ వద్ద అమర్చారు. తాజాగా- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఆ అక్షరాలను తొలగించాల్సి రావడం వివాదాన్ని రేపుతోంది.
ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల ఆదేశాల మేరకే ఐ లవ్ అమరావతి అనే తొలగించి ఉంటారని భావిస్తున్నారు. ఏపీ భవన్ అధికారులు దీనిపై భిన్నవాదనలను వినిపిస్తున్నారు. ఈ అక్షరాల లైట్లు వెలగట్లేదని, వైరింగ్ లోపాలను సరిచేయడానికి తాత్కాలికంగా తొలగించాల్సి వచ్చిందని చెబుతున్నారు. లైటింగ్ సౌకర్యాన్ని పునరుద్ధరించిన తరువాత మళ్లీ ఈ అక్షరాలను అమర్చుతామని అంటున్నారు.
AP Decentralisation: ఏపీ భవన్లో ఐ లవ్ అమరావతి అక్షరాలు తొలగింపు..!#APBhavan #NewDelhi #Amaravati pic.twitter.com/tNoDD35uKk
— Oneindia Telugu (@oneindiatelugu) January 27, 2020
Recommended Video
కారణం ఏదైనప్పటికీ ఈ ఉదంతం కాస్తా రాజకీయ రంగును పులుముకొంది. దేశ రాజధాని సాక్షిగా అమరావతి విధ్వంసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూనుకుందని తెలుగుదేశం నాయకులు ధ్వజమెత్తుతున్నారు. రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఎలా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందో.. అలాంటి ప్రయత్నాలు, చర్యలకు అద్దం పట్టేలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.