అమరావతిలో ఘరానా దొంగలు.. మట్టి, తట్ట అన్నీ మాయం.. ఏపీ రాజధానిలో ఏం జరుగుతోంది?
అమరావతి : చీకటిపడగానే రెచ్చిపోతున్నారు. అందినకాడికి ఎత్తుకెళుతున్నారు. కాదేదీ దొంగతనానికి అనర్హమన్నట్లుగా.. మట్టి, తట్ట సహా కనిపించిందల్లా మాయం చేస్తున్నారు. ఏపీ రాజధాని కేంద్రంగా జరుగుతున్న దొంగల బీభత్సం చర్చానీయాంశంగా మారింది. అడ్డొస్తే బెదిరింపులకు పాల్పడుతూ దర్జాగా చోరీలు చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డులున్నా కూడా దొంగలు రెచ్చిపోతున్న వైనం ఏపీలో కలకలం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దొంగలు పడుతున్నారు. క్యాపిటల్ నిర్మాణ సామాగ్రిని యధేచ్ఛగా క్యాప్చర్ చేస్తూ ట్రాక్టర్లకొద్దీ ఎత్తుకెళుతున్నారు. రాత్రికి రాత్రి విలువైన సామాగ్రి ఎత్తుకెళుతూ అటు పోలీసులకు, ఇటు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు.
ఇద్దరు యువకుల మధ్య 'ఆ సంబంధం'.. ప్రాణాలు పోయేదాకా వ్యవహారం..!
అమరావతిలో దొంగలు పడ్డారు..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రేయింబవళ్లు ఎంతోమంది కష్టపడుతుంటే.. దొంగలు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నిర్మాణ సామాగ్రిని ఎత్తుకెళుతూ పండుగ చేసుకుంటున్నారు. రాజధాని మీద కన్నేసింది చిన్న దొంగలు కాదు.. ఇనుము లాంటి వస్తువులు ఎత్తుకెళ్లే చిల్లర దొంగలు అంతకన్నా కాదు. ట్రాక్టర్లకొద్దీ మాయం చేసే ఘరానా దొంగలు నిర్మాణ సామాగ్రిపై కన్నేశారు.
అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక రాజధాని నిర్మాణ పనులు మందగించడం.. చోరాగ్రేసరులకు కలిసొచ్చే అంశం. అర్ధాంతరంగా పనులు ఆగిపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. అంతేకాదు పలు ప్రాజెక్టుల దగ్గర సదరు కాంట్రాక్టర్లు నిల్వ ఉంచిన కన్స్ట్రక్షన్ సామాగ్రిని రాత్రికి రాత్రి ఎత్తుకెళ్లిపోతున్నారు. కొందరికైతే రాత్రిపూట ఇదే పని తప్ప మరోపని లేనట్లు అడ్డగోలుగా చోరీలకు పాల్పడుతున్నారు.
అర్ధాంతరంగా నిలిచిన పనులు.. దొంగలకు వరం..!
ఎలక్షన్ల ముందు వరకు రాజధాని నిర్మాణంలో భాగంగా చేపట్టిన పలు నిర్మాణ పనుల్లో వేలాదిమంది కార్మికులు రేయనక, పగలనక కష్టపడ్డారు. ఆ క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేసేలా పనుల్లో నిమగ్నమయ్యారు. అలా ఆ సమయంలో పగలు, రాత్రి తేడా లేకుండా ఆయా నిర్మాణ ప్రాంతాలు సందడిగా ఉండేవి. అయితే పనులకు బ్రేక్ పడటంతో చాలామంది కార్మికులు వారి సొంత గ్రామాలకు వెళ్లిపోయారు.
అయితే రాజధానితో పాటు పలు ప్రాజెక్టుల నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ సామాగ్రి పెద్దమొత్తంలో నిల్వ ఉంది. అదే దొంగల పాలిట వరంగా మారింది. ఆ క్రమంలో మట్టి, ఇనుము తదితర సామాగ్రిని ఎత్తుకెళుతున్నారు.
ఎత్తుకెళ్లడమే పని.. అడ్డొస్తే లోకల్ అంటూ బెదిరింపులు..!
ఆయా ప్రాంతాల్లో నిర్మాణ పనులు ఆగిపోవడంతో.. అక్కడి సామాగ్రిని ఎత్తుకెళ్లడమే పనిగా పెట్టుకున్నారు కొందరు. కొన్నిచోట్ల సెక్యూరిటీ గార్డులు లేకపోవడం దొంగలకు కలిసివస్తోంది. రాత్రి సమయాల్లో ట్రాక్టర్లకొద్దీ నిర్మాణ వస్తువులను దోచేస్తున్నారు. ఇనుమైనా, ఇసుకైనా మార్కెట్లో మాంఛి ధర పలుకుతుండటంతో చీకటిపడ్డాక అదనుచూసి యధేచ్ఛగా దొంగతనాలకు పాల్పడుతున్నారు.
తొలుత కొన్ని చోట్లకే పరిమితమైన ఇలాంటి చోరీలు.. ఇప్పుడు చాలా ప్రాంతాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. కొందరు రియల్టర్లు, బడా బాబులు ఈ దొంగతనాలకు సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. చంటి లోకల్ అన్నట్లుగా వ్యవహారం నడిపిస్తూ.. ఎవరైనా అడ్డొస్తే స్థానికులమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
మహిళా ఆఫీసర్ స్నానం చేస్తుండగా.. రహస్య కెమెరాలతో వీడియోలు.. ఆలయ గెస్ట్హౌజ్లో అపచారం..!
మా వెనుక ఎవరున్నారో తెలుసా..!
అయితే దొంగలకు బ్రేక్ వేయడానికి కొన్ని కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది. ఇక కొన్నిచోట్ల సెక్యూరిటీ గార్డులు ఉన్నా కూడా దొంగలు ఏమాత్రం జంకడం లేదు. కొన్ని సందర్భాల్లో వారిని బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇనుము, ఇసుక, మట్టి, తట్ట ఇలా కనిపించిన సామాగ్రిని మాయం చేస్తున్నారు ఘరానా దొంగలు.
ట్రాక్టర్లకొద్దీ మెటీరియల్ ఎత్తుకెళుతున్న దొంగలు తాము స్థానికులమంటూ అక్కడున్నవారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తమ వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారట. అయితే కొందరు కాంట్రాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోతోంది. ఆయా నిర్మాణాల దగ్గర సిబ్బంది కొరత.. రాత్రి పూట గస్తీ నిర్వహించడానికి సరిపోని పోలీస్ వ్యవస్థ వెరసి దొంగలకు వరంలా మారిందనే టాక్ వినిపిస్తుండటం గమనార్హం.