పార్టీ మారడం, వైసీపీలో చేరిన నేతలతో చర్చలపై తోట త్రిమూర్తులు ఏమన్నారంటే?
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు తోట త్రిమూర్తులు పార్టీ మారుతారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. ఆయన ప్రధానంగా జనసేన వైపు చూస్తున్నారని, అలాగే వైసీపీ వైపు కూడా చూస్తున్నారనే చర్చ సాగింది. ఇటీవల వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్లతో అంతకుముందు ఆయనతో చర్చలు జరిపారు. దీంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది.
ఇప్పుడు పార్టీ మారడం లేదు కానీ
దీనిపై తోట తాజాగా, శుక్రవారం స్పందించారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తనకు రాష్ట్రంలోని అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని చెప్పారు. జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ తదితర పార్టీల నుంచి కూడా ఆహ్వానాలు అందినట్లు అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పట్లో తాను పార్టీ మారడం లేదని చెప్పారు. తన నియోజకవర్గం ప్రజలు, అభిమానుల అభిప్రాయం మేరకు నడుచుకుంటానని స్పష్టం చేశారు.
పార్టీలు మారే అవసరం రాలేదు
తనది అభివృద్ధి అజెండా అని తోట త్రిమూర్తులు చెప్పారు. ఇది తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యమని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధే తనకు ముఖ్యమని చెప్పారు. ఇప్పటి వరకు తనకు పార్టీలు మారే అవసరం లేదని చెప్పారు. కోటిపల్లి - నరసాపురం వంతెన నిర్మించాలన్నదే తన కల అన్నారు. టీడీపీలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు.
మూడుసార్లు జస్ట్ మిస్: ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా! కారణాలివే
స్నేహం వేరు, రాజకీయం వేరు
ఇటీవల చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్లతో (వీరిద్దరి వైసీపీలో చేరారు) చర్చలు జరపడంపై స్పందిస్తూ.. వారు తనకు మంచి మిత్రులు అని, ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయం వేరు అని తోట త్రిమూర్తులు చెప్పారు. వారు పార్టీని వీడి వైసీపీలో చేరడం వారి వ్యక్తిగత అభిప్రాయమన్నారు. అది తనకు సంబంధం లేదని చెప్పారు.