మోడీ! నీకు రోజులు దగ్గరపడ్డాయి, పార్లమెంటులో అలా ఇదే లాస్ట్ డే: చంద్రబాబు-మమత వార్నింగ్
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన దీక్షలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ నిరసన దీక్షలో కేజ్రీవాల్, చంద్రబాబు, మమతా బెనర్జీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.
అయిదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ చతికిల పడిందన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి మోడీ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారన్నారు. నోట్ల రద్దు వల్ల 25 లక్షల ఉద్యోగాలు పోయాయని చెప్పారు. దేశ వినాశానికి మోడీ, అమిత్ షాలే బాధ్యులు అన్నారు. జీఎస్టీ పేరుతో జనాన్ని వేధిస్తున్నారని చెప్పారు.
మోడీ! నీకు రోజులు దగ్గరపడ్డాయి
నరేంద్ర మోడీ! నీకు రోజులు దగ్గరపడ్డాయి.. అని చంద్రబాబు హెచ్చరించారు. తనను, మమతా బెనర్జీని, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారిని మోడీ వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నడపడంలో మోడీకి ఓనమాలు కూడా తెలియవని ఎద్దేవా చేశారు. అందుకే ఆయనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిన మోడీ-అమిత్ షా జోడీ, వారికి అన్యాయం చేసిందన్నారు. దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ వృద్ధిరేటు పడిపోయిందన్నారు.
ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు
విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, వారిపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. మోడీ అప్రజాస్వామ్య పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకే తామంతా ఏకమయ్యామని చెప్పారు. మోడీ ఒత్తిడి తట్టుకోలేక ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేశారని, రాఫెల్ అంశంలో సుప్రీంకోర్టుకు సైతం తప్పుడు ప్రమాణపత్రం ఇచ్చారని చెప్పారు. ఎక్కడ, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తామంతా కలిసి ఆందోళన చేశామని, మోడీ నిరంకుశ పాలన నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామన్నారు.
ప్రధానిగా ఇక్కడ మోడీకి ఇదే చివరి రోజు.. మమతా
మోడీ పాలనలో ప్రాథమిక హక్కులు కోల్పోయామని చంద్రబాబు అన్నారు. మోడీ పాలనలో నోట్ల రద్దుతో ప్రజలు నష్టపోయారని, ఆర్థిక రంగం కుదేలైపోయిందని, రైతులు, నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం లభించలేదన్నారు. దేశంలో సహకార వ్యవస్థ ఎక్కడ ఉందన్నారు. కేజ్రీవాల్ తన పరిపాలనతో ఢిల్లీలో అద్భుతాలు చేశారని కితాబిచ్చారు. కాగా, ప్రధానిగా మోడీకి పార్లమెంటులో ఇదే చివరి రోజు అని మమతా బెనర్జీ కూడా అన్నారు.