చంద్రబాబును నమ్ముకుంటే గోదాట్లో కలిసినట్టే!
అమరావతి: కొద్దిరోజుల కిందటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించారు. గుంటూరు, విజయవాడ జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ఆయన ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను రూపొందించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని మంగళగిరిలో తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆయన.. వరుసగా మూడోరోజూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించడానికి ఓటర్ల మద్దతును కోరుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కలెక్షన్ కింగ్ గా డైలాగ్ కింగ్ గా పేరున్న మోహన్ బాబు.. ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ప్రసంగిస్తున్నారు. చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని డైలాగులను పేల్చుతున్నారు. మొదట ఆళ్ల రామకృష్ణా రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి రోడ్ షోలల్లో పాల్గొన్నారు.
వైఎస్ఆర్ సీపీలో చేరిన హాస్యనటి, టీవీ యాంకర్! టీడీపీ అభ్యర్థులను ఓడిస్తానంటోన్న మాజీ ఎమ్మెల్యే
చంద్రబాబు నిజస్వరూపం తెలుసుకోవాలా?.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడండి
గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్ఆర్సీసీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి మద్దతుగా మోహన్ బాబు ప్రచారం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. చంద్రబాబు నయా నయవంచుకుడని ఆరోపించారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించడంలో ఆయనను మించిన వారు లేరని అన్నారు. హత్యలు చేయించడానికి కూడా వెనుకాడరని అన్నారు. రాంగోపాల్వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూస్తే చంద్రబాబు నిజస్వరూపం ఏమిటో తెలుస్తుందని చెప్పారు.
హత్యలకూ వెనుకడని చంద్రబాబు..
తెలుగుదేశం పార్టీ తనదిగా చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటని అన్నారు. కాళ్లు కడిగి, పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి, పార్టీని హైజాక్ చేశారని ధ్వజమెత్తారు. మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీని హస్తగతం చేసుకున్నారని విమర్శించారు. వైఎస్ జగన్మోహహన్రెడ్డి సొంతగా వైఎస్సార్సీపీని స్థాపించి, ప్రజల్లో వెళ్లారని అన్నారు. టీడీపీ అంతరిస్తోన్న పార్టీ అని అభివర్ణించారు. ఎన్నికల అనంతరం టీడీపీ తెలంగాణ తరహాలో ఏపీలోనూ కనుమరుగైపోతుందని అన్నారు. అదే సమయంలో వెలిగిపోతున్న పార్టీ వైఎస్సార్సీపీ అని మోహన్ బాబు చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతటి కష్టమైనా పడతారని ప్రశంసించారు.చంద్రబాబుకు సంస్కారం లేదని, కన్యాదానం చేసిన మామకే వెన్నుపోటు పొడిచి టీడీపీని బలంవంతంగా తన వశం చేసుకున్నారని ఆరోపించారు.
మాట తప్పని, మడమ తిప్పని మనస్తత్వం జగన్ సొంతం..
మాట తప్పని, మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందామని మోహన్ బాబు అన్నారు. చంద్రబాబు కులం, మతం, ప్రాంతం అంటూ విడగొడతారని, ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారని చెప్పారు. జగన్ ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని మోహన్ బాబు అన్నారు. అనుభవం అనేది ఏ ఒక్కరికీ ముందుగా ఉండదని, ఆ మాట కొస్తే చంద్రబాబు ఏ అనుభవం ఉందని ముఖ్యమంత్రి గద్దెనెక్కారని ప్రశ్నించారు. మామను వెన్నుపోటు పొడవటంలో తప్ప మరే దాంట్లోనూ చంద్రబాబుకు అనుభవం లేదని అన్నారు. జగన్ కు ఒక్కసారి అవకాశం ఇస్తే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మించిన విధంగా పాలనను అందిస్తారని అన్నారు.
టీడీపీ పాలనలో వేల కోట్ల అవినీతి తప్ప అభివృద్ధి చోటు చేసుకులేదని మోహన్ బాబు విమర్శించారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నాడు వైఎస్సార్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడూ ఉన్నత చదువులు చదువుకునే వారని, ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. దీనికి తానే ఓ పెద్ద నిదర్శనమని మోహన్ బాబు అన్నారు.
మధ్యలోనే చదువు మానేస్తోన్న విద్యార్థులు..
తాను నడిపిస్తోన్న శ్రీ విద్యానికేతన్ సంస్థకు కోట్ల రూపాయల మేర ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని, ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని అన్నారు. దాదాపు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల పరిస్థితులు ఇలాగే ఉన్నాయని అన్నారు. తెలుగుదేశంతో చేతులు కలిపిన సంస్థలకు మాత్రమే ఫీజు రీ ఎంబర్స్ చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారని, దీనికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయితే విద్యార్థులకు మంచి రోజులు వస్తాయని మోహన్ బాబు అన్నారు.
వ్యూహాత్మకంగా ఆ రెండు జిల్లాల్లో మోహన్ బాబు
గుంటూరు, విజయవాడ జిల్లాల్లో మోహన్ బాబును ఎన్నికల ప్రచారంలో దింపి, వైఎస్ఆర్ సీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ రెండు జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు బలంగా ఉంది. అభ్యర్థుల గెలుపోటములను అవలీలగా తారుమారు చేయగల సత్తా ఈ ఓటుబ్యాంకుకు ఉంది. పైగా- ఈ రెండు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. గుంటూరు టీడీపీ లోక్ సభ అభ్యర్థి గల్లా జయదేవ్ సొంత జిల్లా చిత్తూరు కావడం, మోహన్ బాబు కూడా అదే జిల్లాకు చెందిన, కమ్మ సామాజిక వర్గానికే చెందిన నాయకుడు కావడంతో.. మొదట గుంటూరు, విజయవాడలపైనే కన్నేసింది వైఎస్ఆర్ సీపీ.