కాబోయే ముఖ్యమంత్రికి టీటీడీ అర్చకుల ఆశీర్వచనాలు!
అమరావతి: కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం కోలాహలంగా మారింది. రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలో ఉన్న ఆయన నివాసానికి గురువారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు రాకపోకలు సాగిస్తున్నారు.
పలువురు ప్రముఖులు వైఎస్ జగన్ను కలిసి అభినందనలను తెలియజేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు, వేద పండితులు వైఎస్ జగన్ను ఆయన నివాసంలో కలిశారు. ఆశీర్వచనాలు పలికారు.
కలియుగ దైవం, తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. అక్షింతలను చల్లి, ఆశీర్వచనాలను పలికారు. ఆ సమయంలో వారి వెంట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఉన్నారు.
అలాగే- విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం అర్చకులు, పాలక మండలి ఛైర్మన్, కార్యనిర్వహణాధికారి వైఎస్ జగన్ను కలిశారు. ఆశీర్వచనాలు పలికారు. కనక దుర్గమ్మ అమ్మవారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ వైఎస్ జగన్కు అమ్మవారి నిలువెత్తు చిత్రపటాన్ని బహూకరించారు.