పాత కక్ష-కొత్త ట్విస్ట్: 'సెల్ఫ్గోల్, ఏపీలో వైసీపీని ఫినిష్ చేసేందుకే జగన్తో కేసీఆర్ చేయి కలిపారా
అమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు కేటీ రామారావు బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్ నేత తులసి రెడ్డి భిన్నంగా స్పందించారు. వైసీపీకి నష్టం చేసేందుకే కేసీఆర్.. జగన్తో చేతులు కలిపి ఉంటారని కొత్త అనుమానాలు లేవనెత్తారు. అందుకు కారణం కూడా చెప్పారు.
జగన్ను హైదరాబాదుకే పరిమితం చేస్తాం
జగన్, కేటీఆర్ కలయిక తెలుగు ప్రజలకు చీకటి రోజని టీడీపీ నేత శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని టీఆర్ఎస్ కాళ్ల వద్ద జగన్ తాకట్టు పెట్టారన్నారు. ఆంధ్రులపై కక్ష గట్టిన కేసీఆర్ను జగన్ కలవడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబును చూసి భయపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్తో కలిసి కొత్త నాటకం ప్రారంభించారన్నారు. జగన్ను ఎప్పటికీ హైదరాబాద్కే పరిమితం చేస్తామని చెప్పారు. ఏపీ ప్రజలు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేతలకు రాళ్ల దెబ్బలు తప్పవన్నారు. తెలంగాణ టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యల వల్ల ఏపీలో యాదవులు తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణలో బీసీ కులాలను రిజర్వేషన్ల నుంచి తొలగించినా నోరెత్తని తలసాని, ఇక్కడ మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. మరోసారి ఏపీలో అడుగుపెడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు.
షర్మిలా! నీ అన్న చొక్కాపట్టుకొని అడుగు: పరిటాల సునీత, 'ప్రభాస్' ప్రచారంపై టీడీపీ ఆగ్రహం
ఆంధ్ర ద్రోహుల ఫ్రంట్
జగన్, కేటీఆర్ భేటీపై ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మోడీ, తెలంగాణ మోడీ, ఆంధ్ర మోడీ ఒక్కటయ్యారన్నారు. వీరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఇప్పుడు బయటకు వచ్చిందన్నారు. విభజన చట్టం ద్వారా ఏపీకి రావాల్సిన ప్రయోజనాలను అడ్డుకున్న కేసీఆర్తో ఆంధ్ర ద్రోహుల ఫ్రంట్ ను జగన్ ఏర్పాటు చేశారన్నారు. లంకలో పుట్టినవాళ్లు రాక్షసులని, ఆంధ్రలో పుట్టినవారు వారి వారసులని కేసీఆర్ గతంలో అవమానించారన్నారు. ఆంధ్ర బిర్యానీ పేడలా ఉంటుందని విమర్శించిన కేసీఆర్తో జగన్ జతకట్టారన్నారు.
జగన్ ఘోర తప్పిదం
సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ ఘోర తప్పిదం చేశారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. తెలుగు తల్లిని, సంస్కృతిని, సంప్రదాయాలను అవమానించిన కేసీఆర్తో పొత్తు పెట్టుకొని అతిపెద్ద తప్పు చేశారన్నారు. కేసీఆర్, జగన్ అవిభక్త కవలలు అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పారు. జగన్ తలకిందులుగా తపస్సు చేసినా టీడీపీని, చంద్రబాబును ఏమీ చేయలేరన్నారు. ఏపీకి అన్యాయం చేస్తున్న మోడీని నిలదీసే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. జగన్ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని, వైసీపీ ఓటమి ఖాయమన్నారు.
ఏపీలో వైసీపీని ఫినిష్ చేసేందుకే జగన్తో కేసీఆర్ చేతులు కలిపారా?
కేటీఆర్, జగన్ భేటీపైకాంగ్రెస్ నేత తులసి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన ఉన్న కక్షను జగన్తో పొత్తు పెట్టుకోవడం ద్వారా టీఆర్ఎస్ తీర్చుకుంటోందనే అనుమానం కలుగుతోందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ నామరూపాల్లేకుండా చేయాలని అప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రయత్నాలు చేశారని, ఆయన బతికి ఉంటే నిజంగా అదే జరిగి ఉండేదని, నాడు వైయస్ చేసిన దానికి ప్రతీకారంగా నేడు ఆయన తనయుడు వైయస్ జగన్తో చేతులు కలిపి ఏపీలో వైసీపీని ఫినిష్ చేయాలని చూస్తున్నట్లుగా ఉందని తులసి అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్, జగన్ మధ్య ఫెవికాల్ బంధం ఉందని చెప్పారు జగన్ సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారన్నారు. ఈ మేరకు ఆయన ఓ టీవీ ఛానల్ చర్చలో అన్నారు.