ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ స్థానం ఖాళీగా! ఆ రెండు జిల్లాలకు కొత్త ఎస్పీలు
అమరావతి: అత్యంత వివాదాస్పద పరిస్థితుల్లో బదిలీ వేటుకు గురైన ఆ రెండు జిల్లా ఎస్పీల స్థానంలో కొత్త అధికారులు నియమితులయ్యారు. విజయవాడ జాయంట్ పోలీస్ కమిషనర్ నవదీప్ సింగ్ గ్రెవాల్ శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ గా పనిచేస్తోన్న అభిషేక్ మొహంతిని కడప జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడం వల్లే..
కడప, శ్రీకాకుళం జిల్లాలకు ఇంత హడావుడీగా కొత్త అధికారులను ఎస్పీలుగా నియమించడానికి గల కారణాలు మనకు తెలిసినవే. కడప, శ్రీకాకుళం ఎస్పీలు రాహుల్ దేవ్ శర్మ, వెంకటరత్నంల పనితీరును వివాదాస్పదంగా ఉందని గుర్తించిన ఎన్నికల సంఘం వారిపై బదిలీ వేటు వేసింది. ప్రధానంగా- ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు రాహుల్ దేవ్ శర్మ, వెంకటరత్నంలనూ ఉన్నపళంగా బదిలీ చేయాలని ఆదేశించింది. పోలింగ్ ముగిసేంత వరకూ ఈ ముగ్గురికీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకూడదని కూడా ఆదేశించింది.
ఎన్నికల సంఘం ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ ముగ్గురినీ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ఖాళీని ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. ఏబీ వెంకటేశ్వర రావు బదిలీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నారు. ఏబీ బదిలీని నిరసిస్తూ ప్రభుత్వం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. దీనితో ప్రస్తుతం ఆ స్థానాన్ని ఖళీగా ఉంచింది. కొత్త వారికి పోస్టింగ్ ఇవ్వలేదు.