బాబూకు ఎర్రగడ్డే సరైన ప్లేస్..? సమయం ఆసన్నమైంది.. విజయసాయి విసుర్లు
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడి 23 సీట్లకు పరిమితమైన తర్వాత చంద్రబాబు ఇలాగే గుడ్డలు చించుకుని మాట్లాడారని విమర్శించారు. ఇప్పుడూ అదే ఏడుపు రిపీట్ అయిందని... ఎప్పటిలాగే అధికారులను, పోలీసులను బెదిరించారని చెప్పారు.. వైఎస్ఆర్ సీపీని గెలిపించి ప్రజలు తప్పు చేశారని తేల్చారని అనడంతో చంద్రబాబుకు మతి పూర్తిగా భ్రమించిందని అర్థమవుతోందన్నారు.
పోలీసు అధికారులను చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని గుర్తుచేశారు. పరిస్థితిని గమనించి చంద్రబాబును ఎర్రగడ్డలో చేర్చాల్సిన పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. అందరి వివరాలు రాసుకున్నానని ప్రగల్బాలు పలుకుతున్నారని విజయసాయి గుర్తుచేశారు. ఆధారాలు ఉన్నాయని... జమిలి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిన వెంటనే ఆయన సీఎం అయి తన పవరేంటో చూపిస్తానని చెబుతున్నారని పేర్కొన్నారు.
41 శాతం సర్పంచ్ పదవులు గెలిచామని జబ్బలు చరుస్తున్న చంద్రబాబు.. హిందూపురం, అమరావతి, కుప్పంలో డిపాజిట్లు ఎందుకు రాలేదు అని అడిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నచోట సింగిల్ డిజిట్ దాటలేదని విమర్శించారు. కాకిలెక్కల్ని జనం విశ్వసించరని.. దమ్ముంటే గెలిచారంటోన్న పంచాయతీలను ఎల్లో పేపర్లలోనైనా ప్రకటించాలని సవాల్ విసిరారు.
వైజాగ్ స్టీల్పై ప్రధాని మోడీకి రాసిన లేఖతో తను గోబెల్స్ ప్రచారాలకు పాల్పడ్డట్టు చంద్రబాబు అంగీకరించారని చెప్పారు. జగన్ ప్రభుత్వం ప్లాంటును ప్రైవేటు సంస్థలకు అమ్మాలని చూస్తోందని మొన్నటి దాకా దుష్ప్రచారం చేశారని విజయసాయి మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో ప్రైవేటీకరణను ప్రతిపాదించారని లేఖలో ప్రస్తావించారు అని విజయసాయి ట్వీట్ చేశారు.