తెల్ల రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. అధికారుల కసరత్తు..!
అమరావతి : తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిలిచి పోవడంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి ఇది ఊరటనిచ్చే అంశమని చెప్పాలి. అర్హులైన వారికి కొత్త కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు.
జిల్లాల వారీగా కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తుది జాబితా తయారు చేయనున్నారు. ఆ మేరకు దరఖాస్తుల విచారణ ప్రక్రియ త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. అదలావుంటే ప్రస్తుతం ఇళ్ల పట్టాలకు అర్హులైన లబ్ధి దారుల జాబితా కోసం వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. అది పూర్తయ్యాక రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం కానునట్లు సమాచారం.
ఇళ్ల పట్టాల లబ్ధిదారుల ఎంపిక తర్వాత తెల్ల రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్నారు. ఆ మేరకు వాటిని విచారించే బాధ్యత కొందరికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అదలావుంటే అర్హులను ఎంపిక చేయడం.. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కోసం జిల్లా స్థాయిలో అధికారులకు బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జాయింట్ కలెక్టర్ / ఆర్డీవో కేడర్ లో ఉన్న ఒకరికి బాధ్యతలు అప్పగించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఆ క్రమంలో త్వరలో ఆదేశాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతేడాది చివరలో రేషన్ కార్డులు ఇచ్చారు. ఇక అప్పటి నుంచి రేషన్ కార్డుల జారీ ఊసే లేకుండా పోయింది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో ఫుల్ స్టాప్ పడినట్లైంది. అయితే పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో జగన్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.