ఏపికి కాబోయే సీయం ఎవరు: ఆ రెండు జిల్లాలే డిసైడ్ చేస్తాయా..!
ఏపి లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎవరికి వారే నేనే సీయం అంటూ ప్రజల ముందుకొస్తున్నారు. గత ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాల మధ్య ఓట్ల తేడా కేవలం రెండు శాతం. ఇప్పుడు అదే హోరా హోరీ పోరు తప్పే పరిస్థితి. అయితే, గత ఎన్నికల్లో టిడిపికి బిజెపి- జనసేన మద్దతు ఇచ్చింది. దీంతో..ముఖా ముఖి పోరు జరిగింది. కానీ, ఈ సారి బిజెపి-జనసేన విడివిడిగా పోటీ చేసే పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లో ఏపిలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. కాంగ్రెస్- టిడిపి మధ్య పొత్తు ఉంటుందా లేదా అనేదీ ఆసక్తి కరంగా మారింది. పార్టీలు ఇలా ఉంటే..ఇక గెలుపును డిసైడ్ చేసేది మాత్రం ఆ రెండు జిల్లాలే. దీంతో..ఆ రెండు జిల్లాల చుట్టే ఏపి రాజకీయం కీలకంగా మారింది.
ఏపిలో ఉభయ గోదావరి జిల్లాలదీ రాజకీయంగా కీలకమైన జిల్లాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలు..తూర్పు గోదావ రి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం టిడిపి కైవసం చేసుకుంది. అదే విధంగా..తూర్పు గోదావరి జిల్లాలోని 19 స్థానాల్లో 13 స్థానాలు..ఒక స్వతంత్ర అభ్యర్ధి గెలవగా ఆ మద్దతు కూడా టిడిపి కే దక్కింది. వైసిపి కేవలం అయిదు స్థానాలతో సరి పెట్టుకుంది. గత ఎన్నికల్లో మోదీ ఫ్యాక్టర్ తో పాటుగా సినీ హీరో పవన్ కళ్యాన్ మద్దతు ఆ జిల్లాల్లో టిడిపి గెలుపు కు దోహదం చేసింది.
జనసేన సైతం
ఇక, ప్రస్తుత ఎన్నికల పరిస్థితి చూస్తే..టిడిపి- వైసిపి తో పాటుగా జనసేన సైతం ఈ రెండు జిల్లాలో సీట్ల పై ప్రత్యేక దృష్టి సారించింది. పవన్ కళ్యాన్ నెలల తరబడి ఈ రెండు జిల్లాల్లో తన యాత్ర కొనసాగిస్తున్నారు. సామాజిక సమీకరణాల కోణంలోనూ ఈ రెండు జిల్లాల పై జనసేన ప్రభావం ఎక్కు వ గా ఉంటుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, టిడిపి గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కాపు రిజర్వే షన్ల హామీ ఇప్పటికీ అమలు కాలేదు.
పవన్ ఈ అంశం పై
కాపు రిజర్వేషన్ల పై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి..కేంద్రం ఆమోదం కోసం ఏపి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తమ చేతుల్లో ఉన్నంత వరకూ చేసామని..ఇక కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇక, వైసిపి అధినేత తాను కాపు రిజర్వే షన్ల పై ఎటువంటి హామీ ఇవ్వలేనని చెప్పటం ద్వారా..నిజాయితీగా వ్యవహరించారనే వాదన ఒకవైపు..కాపులకు దూర మయ్యారని మరో వాదన వినిపిస్తున్నాయి. ఇక, పవన్ ఈ అంశం పై స్పష్టంగా తన వైఖరి చెప్పక పోయినా.. ఆ వర్గం పవన్ కు సహజంగానే అండగా ఉంటుందనే అభిప్రాయం బలంగా ఉంది.
వైసిపి ప్రయత్నిస్తోంది
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలాగైనా తమ శక్తి చాటాలని వైసిపి ప్రయత్నిస్తోంది. చరిత్రను పునరావృతం చేయాలని టిడిపి ఆశిస్తోంది. అయితే, ఆ జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేల పై అసంతృప్తి ఉందనే వాదన వినిపిస్తోంది. అభ్యర్ధు ల మార్పు తప్పదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక, వైసిపి మాత్రం గతంలో పోటీ చేసిన వారిని కొన్ని నియోజకవ ర్గాల్లో మార్చి కొత్త సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తోంది. పవన్ కళ్యాన్ మాత్రం తన సొంత జిల్లా కావటంతో ఇక్కడ తమ పార్టీకి..సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయని..ఖచ్చితంగా అధిక సీట్లు గెలుచుకుంటామనే ధీమా లో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ జిల్లా పై పవన్ ప్రభావం పడి టిడిపికి సహకరించింది.
కాపులతో పాటుగా ఆ జిల్లాలో
ఇప్పుడు, పవన్ విడిగా పోటీ చేస్తుండటంతో ఓట్లు చీలుతాయా..అక్కడి ప్రధాన సామాజిక వర్గ ఓట్లు ఏ పార్టీ దక్కించుకుంటుదనేది ఆసక్తి కరంగా మారింది. కాపులతో పాటుగా ఆ జిల్లాలో ఎస్సీ, క్షత్రియ, బిసి ఓటింగ్ కూడా కీలకం. ఇదే జిల్లాలో మూడు ఎస్సీ నియోజకవర్గాలు...ఒకటి ఎస్టీ నియోజకవర్గం ఉంది. ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్న అధికార - ప్రతిపక్ష పార్టీలు సామాజిక సమీకరణా లే ఆయుధంగా ఇక్కడ పావులు కదుపుతున్నారు. ఇక, జనసేన ప్రభావం ఆధారంగా ఈ రెండు పార్టీల విజయావకాశాలు ఆధార పడి ఉంటాయని విశ్లేషకుల అంచనా.
ముద్రగడ పద్మనాభం
ఇక, తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో నాలుగు రిజర్వ్ నియోజకవర్గాలు. ఈ జిల్లాలో 2014 ఎన్నికల్లో టిడిపి 13 స్థానాలు గెలుచుకుంది. వైసిపి అయిదు స్థానాలు గెలవగా అందులో ముగ్గురు పార్టీ ఫిరాయించారు. ఈ జిల్లాలో సామాజిక సమీకరణాలే పార్టీల గెలుపు ఓటములను డిసైడ్ చేస్తాయి. కాపు రిజర్వేన్ల కోసం ఇదే జిల్లాలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ముద్రగడ పద్మనాభం సైతం ఇదే జిల్లావాసి కావటంతో ఎన్నికల సమయంలో ఆయన ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తారనేది ఆసక్తి కరమే. ఇక, జనసేన అధినేత ఇదే జిల్లాలో దాదాపు ప్రతీ మండలంలోనూ పర్యటించారు. ఆయన సభలకు హాజరు బాగానే కనిపించింది. అయితే, ఆయన స్పీచ్ లపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
బిసి వర్గానికి ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ
బిసి - ఎస్సీ ఓటింగ్ సైతం ఈ జిల్లాలో ప్రభావం చూపనుంది. బిసి లకు రాజమండ్రి ఎంపీ సీటు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన వైసిపి అధినేత జగన్..ప్రతీ బిసి వర్గానికి ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. ఇక, టిడిపి సైతం ఇదే జిల్లా కేంద్రంగా బిసి గర్జన కు నిర్ణయించింది. కాంగ్రెస్ సైతం ఈ జిల్లాలో గతం కంటే మెరుగ్గా ప్రభావం చూపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టిడిపి- కాంగ్రెస్ కలిసి పొత్తుతో ఎన్నికలకు వెళ్తే..
ఈ జిల్లా తీర్పు విలక్షణంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. పవన్ కళ్యాన్ కు ఈ జిల్లాలో ఏ మేర మద్దతు లభిస్తుందనే అంశం ఆధారంగా వైసిపి - టిడిపి గెలుపు ఓటములు డిసైడ్ కానున్నాయి. ఏది ఏమైనా ఈ రెండు జిల్లాల్లో అధిక సీట్లు సాధించిన పార్టీయే అధికారం ఏర్పాటు చేయటం ఖాయం. ముఖ్యమంత్రిని సైతం ఈ రెండు జిల్లాలే ఖరారు చేయనున్నాయి. దీంతో..ఇప్పుడు అందరి దృష్టి ఈ రెండు జిల్లాల పైనే ఉంది.