జీవో వెనక్కి తీసుకోమనడం తగదు, 27వ తేదీన మరోసారి చర్చలు: సజ్జల
ఏపీలో పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు- ప్రభుత్వం మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇవాళ చర్చలకు ఉద్యోగ సంఘాలు రాలేదు. సమ్మె నోటీసు ఇవ్వడం.. ఇతర సంస్థలు, ఉద్యోగులు మద్దతు తెలుపడం ఉత్కంఠ రేపుతోంది. పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం పట్టు వీడటం లేదు. ఉద్యోగ సంఘాలు బెట్టు దిగడం లేదు. పీఆర్సీ జీవో నిలిపివేయాలని ఉద్యోగా సంఘాల నేతలు కోరారు. దీనిపై ప్రతిష్టంభన నెలకొంది. ఒక్కసారి జారీ చేసిన జీవోలు వెనక్కి తీసుకోవాలని కోరడం సమంజసం కాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
అడక్కుండానే సీఎం జగన్ అన్నీ ఇచ్చారని సజ్జల చెప్పారు. ఇంతకాలం చేసిన ప్రక్రియను తిరగతోడటం సరికాదని ప్రభుత్వం అప్పీల్ చేస్తోందన్నారు. మార్పుల గురించి మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మళ్లీ 27వ తేదీన చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరామని సజ్జల తెలిపారు. పీఆర్సీ అంశంపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. రాష్ట్ర జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు ఉద్యోగ సంఘాల నేతలు నోటీసును ఇచ్చారు. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు నోటీసులో తెలిపారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని సమ్మె నోటీసులో డిమాండ్ చేశారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకునేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఏపీలో వచ్చే నెల 7వ తేదీ నుంచి సమ్మె చేపడుతామని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వారికి ఆర్టీసీ యూనియన్లు కూడా మద్దతు తెలిపాయి. అంటే ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రగతి రథ చక్రాలకు బ్రేక్ పడనుంది. ఆర్టీసీ బస్సులు కదపకపోవడంతో.. సామాన్య జనం ఇబ్బంది పడే అవకాశం ఉంది. పీఆర్సీ సాధన సమితికి ఆర్టీసీ ఉద్యోగులు మద్దతు తెలిపారు. పెద్ద సంఘాలు మద్దతు తెలపడంతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. జీతాలు తగ్గించుకోవాలంటే..కుదరదని, ఆర్టీసీ ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నా గతంలో ప్రతి నెలా ఒకటి తేదీనే వేతానాలు వచ్చేవని గుర్తుచేశారు. ప్రస్తుతం రెండు నుంచి ఏడు, తొమ్మిదో తేదీ వరకు జీతాలు పడుతున్నాయని తెలిపారు. 8 శాతం హెచ్ఆర్ఏ లో పెట్టిన తర్వాత, జీతాలు తగ్గవని ప్రభుత్వం ఎలా చెబుతుందో అర్థం కావడం లేదన్నారు.